అవార్డు వద్దన్న అమ్మాయి

ఎవరికైనా 35 లక్షల రూపాయలు వస్తున్నాయంటే చాలు తీసుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ స్వీడిష్ కంట్రీకి చెందిన యువ కెరటం గ్రెటా థంబర్గ్‌ మాత్రం తనకు డబ్బులు, అవార్డు వద్దని చెప్పేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. ఈ ఏడాది పర్యావరణ అవార్డు విజేతగా స్వీడన్‌, నార్వే ఆమె పేరును ప్రకటించాయి. గ్రెటాకు అవార్డుతో పాటు 35 లక్షల రూపాయలు బహుమతిగా అందుతాయి. గ్రెటా మాత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కర్లేదని, వాతావరణ మార్పుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గ్రెటా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.

రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మనకిప్పుడు కావాలని కోరారు. సైన్స్‌ చెబుతున్న వాస్తవాలు వారు గ్రహించాలి అన్నారు. ఇక తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా గ్రెటా మాట్లాడారు. పర్యావరణం విషయంలో స్వీడన్‌, నార్వే, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌ దేశాలు వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. చాలా అందమైన మాటలు చెబుతారు. అయితే కర్భన ఉద్గారాల విషయానికి వచ్చే సరికి మాత్రం వెనకడుగు వేస్తారు. తలసరి ఆదాయం గురించి లెక్కిస్తారు గానీ ఒక్కక్కరు పర్యావరణానికి ఎలా హాని చేస్తున్నారో మాత్రం లెక్కలు వేయరు అని చురకలు అంటించారు.

నా కలల్ని, నా బాల్యాన్నీ మీరు దొంగిలించారు. వట్టి మాటలు మీవి. మీకేం పట్టదా అని నిలదీశారు. ప్రజలు ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. చని పోతున్నారు. మొత్తం పర్యావరణమే ధ్వంసమై పోయింది. కొద్ది మంది అదృష్ట వంతులలో నేనొక దానిని. మేం బతికే ఉన్నాం. అంతరించి పోతున్న జీవ జాతుల అంతిమ దినాలలో ఆఖరి శ్వాసను పీలుస్తూ కొన ఊపిరితో ఉన్నాం. మీకు డబ్బు కావాలి. అభివృద్ధి కావాలి. వాటి కోసం కట్టు కథలతో మమ్మల్ని మభ్య పెడుతున్నారు. హౌ డేర్‌ యూ అంటూ అమెరికా కాంగ్రెస్‌ వేదికగా ప్రజా ప్రతినిధులను, ప్రపంచ దేశాధి నేతలను ప్రశ్నించి గ్రెటా పతాక శీర్షికల్లో నిలిచింది. గ్రెటా ను చూసి నేర్చు కోవాల్సింది ఏంత్తో ఉంది కదూ.

కామెంట్‌లు