ఉగ్ర మూకల అంతం..భారత్ లక్ష్యం
కోట్లాది మంది ప్రజలు నాపై అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. వారి సంక్షేమమే నా ప్రధాన ఎజెండా. ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నేను రేయింబవళ్లు కష్ట పడుతున్నా. ఇదే సమయంలో ప్రతి ఒక్క దేశం బాగుండాలని కోరుకుంటా. సమున్నత భారతావని మీద ఏ ఒక్కరు దాడికి పాల్పడాలని ఆలోచన చేసినా, లేదా ప్రయత్నం చేసినా నామ రూపాలు లేకుండా చేస్తా. మేం మొదటి నుంచి శాంతిని కోరుకుంటున్నాం. ఎందరో జాతి విముక్తి కోసం జరిగిన పోరాటంలో అసువులు బాశారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది.
దానిని చిదిమి వేసే హక్కు ఎవ్వరికీ లేదన్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా అది అత్యంత ప్రమాదకర మైనదని అన్నారు. దాని అంతం మనందరి పంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలో భాగంగా మోదీ రియాద్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా సౌదీ కింగ్
సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్తో పాటు ప్రభుత్వంలోని విద్యుత్, ఇంధన, కార్మిక, వ్యవసాయ, జల నిర్వహణ, తదితర శాఖల మంత్రులతో సమావేశమై చర్చలు జరిపారు. ఆయిల్ అండ్ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు తదితర రంగాల్లో సహకారంపై సంతకాలు చేశారు.
ఉగ్రవాదంపై పోరు సహా భద్రతకు సంబంధించిన అంశాల్లో భారత్, సౌదీ అరేబియాల మధ్య సహకారం విజయవంతంగా ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. ఆసియా దేశాల్లో సౌదీ అరేబియా, భారత్లు తమ పొరుగు దేశాల నుంచి ఒకే రకమైన భద్రతా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని మోదీ చెప్పారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలికి సంబంధించి ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని చెప్పారు మోదీ.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి