శేషేంద్రుడు ప్రాతః స్మరణీయుడు

రూపం అపురూపం. అక్షరం అద్భుతం. తెలుగు సాహిత్యంలో గుంటూరు శేషేంద్ర శర్మ ఓ సంచలనం. ఎన్నదగిన సాహితీవేత్తలలో ప్రముఖుడిగా ఉన్నారు. ఆయన రాసిన ప్రతి అక్షరం, పదం జనాన్ని, లోకాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. అలంకార శాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వ మానవ దృష్టి. అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. సర్వేజనా సుఖినో భవంతు అన్నది ఆయన ఆత్మ నినాదం. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు గ్రామంలో పుట్టారు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేటు తో పాటు ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పని చేసి, పదవీ విరమణ పొందారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణ హంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం...