నవ్వుల రేడు నవ్విన రోజు
తెలుగు సినిమాలో ఆరోగ్యకరమైన హాస్యానికి కేరాఫ్ గా నిలిచిన కమెడియన్ రాజబాబు ను ఎలా మరిచి పోగలం. బతికినన్నాళ్లు అందరిని నవ్వించేందుకు ప్రయత్నం చేశారు. ఈ రంగంలో రెండు దశాబ్దాల పాటు ప్రముఖ హాస్య నటునిగా రాజబాబు వెలుగొందరు. అక్టోబరు 20 న 1935 లో పుట్టారు. శతాబ్దపు హాస్య నటుడిగా ప్రసంశలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్య మూర్తుల అప్పల రాజు. తల్లిదండ్రులు పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు, శ్రీమతి రవణమ్మ. నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్ర కథ నేర్చు కోవడానికి అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్ది కాలం పనిచేశాడు.
పాఠాలు చెబుతూనే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. అందులో నటించే వాడు. ఇదే సమయంలో ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన పుట్టినిల్లు సినిమా దర్శకుడు గరికపాటి రాజారావు సినిమాలలో చేరమని ఉత్సాహ పరిచాడు. దీంతో చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నాడు. పూట గడవడానికి హాస్య నటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పే వాడు. కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. మొదటి సినిమా తరువాత తండ్రులు-కొడుకులు , కులగోత్రాలు , స్వర్ణగౌరి, మంచి మనిషి మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్ట మొదటి పారితోషికంగా స్వీకరించాడు. మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే కుక్కపిల్ల దొరికిందా, నాలుగిళ్ళ చావిడి , అల్లూరి సీతారామరాజు మొదలగు నాటకాలు వేశాడు.
జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ చిత్రం అంతస్తులు చ్రిత్రంలో నటించినందుకు గాను మొట్ట మొదటి సారిగా పెద్ద మొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందాడు. తరువాత వెనక్కు తిరిగి చూసు కోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో ప్రముఖ చిత్రాలలో నటించాడు. ఆ సమయంలో ఆకాశరామన్న, సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర, సంగీత లక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం లాంటి చిత్రాలలో నటించాడు. రాజబాబుకు జంటగా లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి, గీతాంజలి లాంటి వారు నటించినా, ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అని చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రా హాస్య జంటగా పేరు తెచ్చాయి. రాజబాబు తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగా నటించారు.
ఈ సినిమాలలో ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు. సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించిన రాజబాబు నిజ జీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాత తరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించే వాడు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన బాలకృష్ణను సత్కరించాడు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్ర పరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇచ్చాడు. అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు. దాని పేరుకూడా ఆయన పేరు మీదే రాజబాబు జూనియర్ కళాశాల గా ఉంది.
వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్ట మొదటి హాస్య నటుడు రాజబాబు. తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు, ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందాడు. చెన్నై ఆంధ్రా క్లబ్బు వారు వరుసగా ఐదు సంవత్సరాలు రోలింగ్ షీల్డు ని ప్రధానం చేసారు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు. రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. మహా శివరాత్రి రోజు, ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రి లోనే ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయాడు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమ గొప్ప నటుడినే కాదు అంతకంటే గొప్పనైన మానవుడిని కోల్పోయింది.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి