తేల్చుకోనున్న జేఏసీ - 23 న ఓయూలో సభ
ఆర్టీసీ బంద్ సక్సెస్ కావడం ..ప్రభుత్వం స్పందించక పోవడంతో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు ఆర్టీసీ జెఎసి. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం అయ్యారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఇతర జేఏసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ జేఏసీ నాయకులను కలవనున్నారు. అలాగే, ఎంఐఎం నేతలనూ కలవాలని నిశ్చయించారు. 23న ఉస్మానియా యూనివర్సీటీలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జేఏసీ తీర్మానించింది. ఇక ధర్నా కార్యక్రమంలో గాయపడ్డ పోటు రంగారావుని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి పరామర్శించనున్నారు. సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ సంపూర్ణం అయ్యింది.
పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలి. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం కావాలి. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడింది. కాలయాపన మంచిది కాదు. సర్కార్ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది. తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన ఉద్యమాల్లో ఇదే అతి పెద్ద ఉద్యమం. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతాం. మళ్లీ గవర్నర్ ను కలుస్తాం. ఎంఐఎం నేతలను కూడా కలుస్తాం. నాయకుల వేళ్లు తీసినా, తలలు నరికినా ఉద్యమం ఆగదు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్టని కేసులు ఆర్టీసీ సమ్మెలో మా కార్మికుల పై పెడుతున్నారు అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. రేపు అన్ని చౌరస్తాల్లో పువ్వులు ఇచ్చి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరతామని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు.
రాజకీయ పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.15 రోజుల నుంచి ఆర్టీసీకి వస్తున్న డబ్బులు ఎక్కడకు పోతున్నాయని జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికుల వల్లే 155 కోట్లు నష్ట మొచ్చిందని..ఆర్టీసీ దగ్గర కేవలం 8 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. ప్రభుత్వం కచ్చితంగా తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జాతీయ బిసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు పంపించారు. ఆర్టీసీలో 20000 వేల మందికి పైగా బీసీ కార్మికులు ఉన్నారని, వాళ్లకు జీతాలు ఇవ్వకుండా, విధుల్లోకి తీసుకోకుండా వేధింపులకు గురి చేయడం బాధాకరమన్నారు. తక్షణమే ఈనెల 25 లోపు పూర్తి వివరాలతో ఢిల్లీ కమిషన్ ఎదుట ఆర్టీసీ తాత్కాలిక ఎండీ హాజరు కావాలని ఆచారి ఆదేశించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి