సొమ్ము సర్కార్ ది.. సోకు జీవీకే ది
బాధ్యతతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఎలా వుంటుందో తెలుసు కోవాలంటే 108 సర్వీస్ ఒక్కటే ఉదాహరణ. ఎందుకు ప్రైవేట్ సంస్థకు అప్పగించారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజలకు నిరంతరం అత్యవసర సేవలందిస్తూ మన్నననలు అందుకుంటోంది 108 . నిర్వహణ భారానికి అయ్యే ప్రతి పైసా ..ఖర్చంతా సర్కార్దే. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీస్ నడుస్తోంది. దీని మీదే ఆధారపడి బతుకుతున్న వాళ్లు ఎందరో వున్నారు. చాలా మంది చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారు. యాజమాన్యం ఒంటెద్దు పోకడ పోవడం, పూర్తిగా జవాబుదారీగా ఉండక పోవడం లాంటి సమస్యలతో 108 అల్లాడుతోంది. ఎందరో బలిదానాల సాక్షిగా ఏర్పాటైన తెలంగాణ సర్కార్ హయాంలోనైనా పూర్తిగా ప్రైవేట్ సంస్థ నుండి తమకు విముక్తి లభిస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లారు. అప్పట్లో పేదలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి సంపూర్ణ మద్ధతు లభించింది. అయితే నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోగలిగితే మరింత మేలు జరుగుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలు, తీసుకున్న నిర్ణయాలు, అనాలోచిత చర్యల వల్ల ఈ సర్వీసెస్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అన్ని శాఖలు, సంస్థలు సర్కార్ ఆధీనంలోనే ఉంటాయని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నీటి మూటగానే మిగిలింది. ఇటీవల తమపై వేధింపులు ఎక్కువయ్యాయని, పేరుకే 8 గంటల విధులంటూ..14 నుండి 16 గంటలకు పైగా తమతో పనులు చేయించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వేతనాలతో ఇల్లు గడవడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఎమర్జెన్సీ సర్వీస్లను సర్కార్ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఎప్పుడు తీసి వేస్తారొనన్న భయాందోళనతో బతుకుతున్నామని అంటున్నారు.
అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 108 సర్వీస్ నిర్వహణ కోసం జీవీకే సంస్థ అధినేత మోహన్ రెడ్డికి అప్పచెప్పుతూ సంతకం చేశారు. దీంతో ఆనాటి నుండి నేటి దాకా ఆ సంస్థనే ఈ సర్వీస్ను నిర్వహిస్తూ వస్తోంది. ఒకసారి యశోద యాజమాన్యానికి అప్పగించాలనే యోచన చేసిందీ ఆపద్దర్మ సర్కార్. ఎందుకనో మళ్లీ మోహన్రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఎమర్జెన్సీ సేవల్లో ఎలాంటి అలసత్వం ఉండరాదనే ఉద్దేశంతోనే దివంగత రాజశేఖర్ రెడ్డి దీనితో పాటు ఆరోగ్యశ్రీకి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.
సత్యం కుంభకోణం వెలుగులోకి రావడం తో దీని నిర్వహణను జీవీకేకు అప్పచెప్పారు . ఈ విషయం పై అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి డీ ఎల్ రవీంద్రా రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు . కిరణ్ పై ఆరోపణలు చేశారు . సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించకుండా ఇలాంటి ప్రైవేట్ సంస్థకు ఎందుకు అప్పగించాలో చెప్పాలని డిమాండ్ చేశారు . ఇలాంటి లోపభూయిష్టమైన విధానాలకు తెర లేపి ప్రజల బాగోగులను పక్కన పెట్టిన వైనంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి . ఆయన చేసిన హడావుడి సంతకాల విషయంలో అప్పటి గవర్నర్ తిప్పి పంపిన దాఖలాలు వున్నాయి .
ఎమర్జెన్సీ సేవల్లో ముందు వరుసల్లో ఉంటున్న ఈ 108 సర్వీసుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉన్నది . చంద్ర బాబు , వైఎస్సార్ , కిరణ్ పాలన కాలంలో ఇది ఎన్నో చేతులు మారింది జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది . గ్రామీణ , పట్టణ, గిరిజన , ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అంద జేస్తోంది. అందుకోసమే దీనిని ప్రత్యేకంగా రూపొందించారు .
ఇదే తరహా పని విధానం అమెరికాలో కూడా వున్నది . రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన జాతీయ రహదారులపై 108 సర్వీస్ వాహనాలు రయ్ రయ్ మంటూ పరుగులు తీస్తున్నాయి . ఇందు కోసం సిబ్బంది , వాటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా అధికారులు , అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ సర్వీసులు నడిపిస్తున్నారు . దీనిని టేకోవర్ చేసుకునేందుకు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ముందుకు రాలేదు . మొత్తం వాహనాలకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చును భరిస్తోంది. 95 శాతం సర్కార్ భరిస్తోంటే 5 శాతం మాత్రం జీవీకే భరిస్తోంది . అయితే ప్రచారం మొత్తం జీవీకే కు దక్కుతోంది.
ఇదేమని ప్రశ్నించే ప్రజా ప్రతినిధులు లేకుండా పోయారు . పోనీ ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలు అడగడం లేదు . 2011 లో జీవీకే సెప్టెంబర్ 19 న ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకుంది . దాని టైం అయిపోవడం తో తెలంగాణ సర్కార్ మళ్ళీ అదే సంస్థకు గుండు గుత్తగా అప్పగించేసింది .
2005 లో సంస్థగా ఏర్పడింది . 2009 లో పూర్తి స్థాయిలో ఈ ఎం ఆర్ ఐ గా మారింది .
ఖర్చు సర్కార్ దే .. 108 సర్వీస్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఒక్కో అంబులెన్స్ వాహనానికి 96 వేళా రూపాయలు ఇస్తోంది . రోజు వారీ .. నెల వారీ నిర్వహణతో పాటు సిబ్బంది జీతాలు , వాహన పరికరాలు , పీఎఫ్ , జీఐఎస్ , గ్రాట్యుటీ , తదితర ఖర్చుల కోసం కేటాయించింది . ఆయిల్ , రిపేర్లు , మెయింటెనెన్స్ , కమ్యూనికేషన్స్ , పరిపాలన నిర్వహణ కోసం వీటి నుంచే ఖర్చు చేస్తామంటూ ఒప్పందంలో పేర్కొన్నారు . మొత్తం వందలకు పైగా వాహనాలు ఉన్నాయి .
తమ చేతికి వచ్చాక సదరు సంస్థ పూర్తిగా అంకెల్ని మార్చేసిందన్న ఆరోపణలున్నాయి . ఇటీవల సిబ్బంది తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు . ప్రభుత్వం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది . కానీ సంస్థ ను మాత్రం వద్దనలేదు. కేవలం జీత భత్యాలకు ఒక్కో వాహనానికి లక్షల్లో ఖర్చవుతుందని జీవీకే యాజమాన్యం సర్కార్ కు స్పష్టం చేసింది . కెపాసిటీ బిల్డింగ్ పేరుతో వేలాది రూపాయలు తగలేశారు . దీని కోసం ఏకంగా కోటి కేటాయించారు . కాల్ సెంటర్ , అంబులెన్స్ ల పై ఆజమాయిషీ , మంజూరైన నిధులను ఖర్చు చేయడం కోసం వీటిని వాడతారు . 79 కోట్ల 37 లక్షల 66 వేళా రూపాయలు ఇచ్చేసింది . వీటి నిర్వహణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు . అది ఉన్నదో లేదో తెలియదు . జిల్లా స్థాయిల్లో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారయ్యాయి .
108 వాహనాల నిర్వహణ కు ప్రతి జిలాల్లో ఓ ఆఫీస్ , కో ఆర్డినేటర్ ఆధ్వరంలో కార్యకలాపాలు రోజూ వారీగా జరుగుతాయి . ప్రతి రోజు ఎన్ని కేసులు వచ్చాయి , ఎంత మందిని ప్రధాన ఆసుపత్రులకు , ఇతర ఆసుపత్రులకు చేర్చారనేది రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది . ఎమర్జెన్సీ కేసులు ఎన్ని వచ్చాయి అన్నది ప్రధానం . ఎంఓయూ ప్రకారం ఎలా నిర్వహిస్తున్నారనేది పర్యవేక్షణ ఉండాలి .
పర్వేక్షణ నిల్ : ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత ఖర్చుతో నిర్వహిస్తున్న 108 సర్వీసుల పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేశారు . స్పెషల్ ఆఫీసర్ పరిధిలో ఎప్పటికప్పుడు ఏమేం జరుగుతున్నదో రోజు వారీగా చూడాల్సి ఉండ్తుంది . ఎన్ని కాల్స్ , అందులో ఎన్ని మిస్ అయ్యాయో ..ఎన్ని వాహనాలు .. ఎక్కడికి వెళుతున్నాయి చూడాలి . బాధితుడు , రోగికి సంబంధించి వివరాలు నమోదు చేశారా అన్నది పరిశీలించాలి .
ప్రజల నుంచి వినతులు తీసుకున్నారా .. మూడు నెలలకు ఒకసారి ఖర్చు .. పద్దుల నిర్వహణ కూడా చూడాలి . ఎప్పటికప్పుడు జీవీకే సంస్థ సర్కార్ కు రిపోర్ట్ ఇవ్వాలి . అన్నీ అంకెలే .. ప్రతి రోజు పెరఫార్మెన్స్ సూచికను తయారు చేస్తారు . నెలకు ఒక వాహనం 4500 కిలోమీటర్లు తిరగాలి . 25000 గర్భిణులను చూయించాలి . 48 గంటల్లో చికిత్స అనంతరం భాదితులను వారి ప్రాంతాలకు చేర్చాల్సి ఉంటుంది . పట్టణ ప్రాంతాల్లో ప్రతి 20 నిమిషాలకు , గ్రామీణ ప్రాంతాలకు ప్రతి 25 నిమిషాలకు , ఆదివాశీ ప్రాంతాలకు ప్రతి 30 నిమిషాలకు ఒక కాల్ తీసుకోవాలని పొందు పరిచారు . 2011 నేటి దాకా దేని కోసం ఎంత ఖర్చు చేశారో ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి .
కోట్లాది రూపాయలు కట్టబెట్టిన సర్కార్ ఆజమాయిషి వచ్చేసరికల్లా నిమ్మకుండి పోయింది . జీవీకే పరివారం మాత్రమే ఇందులో ఉండటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . వైద్య ఆరోగ్య శాఖ చూసీ చూడనట్టు ఉండటం వల్ల ప్రజా ధనం పక్క దారి పట్టే అవకాశం వుంది . ఇప్పటికైనా జీవీకే సంస్థకు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ కే అప్పగించి ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తే బావుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి