కారు జోరు..విప‌క్షాల బేజారు - ముగిసిన పంచాయ‌తీ

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో అధికార పార్టీకి చెందిన అభ్య‌ర్థులు త‌మ సత్తా చాటారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గులాబీ ద‌ళాలు దూసుకు వెళితే..ఈసారి ప‌ల్లెల్లో సైతం త‌మ‌కు అడ్డు లేదంటూ చెప్ప‌క‌నే చెప్పారు. పంచాయ‌తీల‌లో స్థానికుల‌కే అధిక ప్రాధాన్యం ఉన్న‌ప్ప‌టికీ ఎక్కువ శాతం ప్ర‌భుత్వం వైపే మొగ్గు చూపారు. ప‌నులు పొందాల‌న్నా ..నిధులు రాబ‌ట్టు కోవాల‌న్నా..నిధులు మంజూరు కావాల‌న్నా..లేదా ఏ ప‌నైనా చేసుకోవాలంటే ప‌వ‌ర్ లో ఉన్న వారికే మ‌ద్ధ‌తు తెల‌పాల్సి ఉంటుంది. దీనినే అభ్య‌ర్థులు ఫాలో అయ్యారు. కొన్ని చోట్ల ప్ర‌తిప‌క్షాలు త‌మ ఉనికిని కాపాడుకునేందుకు శ‌త‌విధాలుగా చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌కు ముందే ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ఉన్న కేటీఆర్ ..ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే 25 ల‌క్ష‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీని భారీ ఎత్తున స్పంద‌న ల‌భించింది.

క్యాష్ కోసం ఏకంగా ఎమ్మెల్యేలు , ఎంపీలు రంగంలోకి దిగారు. త‌మ వారికి ప‌ద‌వులు ద‌క్కించుకునేలా పావులు క‌దిపారు. టీఆర్ఎస్‌తో ఢీకొనేందుకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం , త‌దిత‌ర పార్టీల మ‌ద్ధ‌తుతో అభ్య‌ర్థులు పోటీ చేశారు. అయినా ప‌వ‌ర్ లోకి రాలేక పోయారు. ఈ ఎన్నిక‌లు సైతం అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పింప చేశాయి. డ‌బ్బులు, మ‌ద్యం తీవ్రంగా ప్ర‌భావితం చూపాయి. కొన్ని చోట్ల గ్రామాల‌పై పెత్త‌నం చెలాయించేందుకు విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేశారు. కొన్ని ప్రాంతాల్లో కేసులు న‌మోద‌య్యాయి. ఎట్ట‌కేల‌కు రెండు విడ‌తలుగా జ‌రిన ప‌ల్లెల పోరులో ప్ర‌జలు స్వేచ్ఛ‌గా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

మొద‌టి విడ‌త‌లో జ‌రిగిన పంచాయ‌తీ పోరులో కారు స్పీడ్ అందుకోగా ..రెండో విడ‌త‌లోను బ్రేక్ లేకుండా సాగింది. మొద‌టి , రెండు విడత‌ల్లో టీఆర్ఎస్ త‌మ హ‌వాను కొన‌సాగించింది. 5234 పంచాయ‌తీల్లో గులాబీ జెండా ఎగుర‌గా..కాంగ్రెస్ పార్టీ మ‌ద్ధ‌తుతో 1691 మంది గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ స‌పోర్ట్ తో 65 మంది అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ధ‌తుతో 101 మంది , సీపీఐ నుండి 31 మంది, సీపీఎం నుండి 55 , ఇత‌రులు 1309 మంది గెలుపొందారు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. అన్ని జిల్లాల్లోనూ తెరాస జోష్‌ కనిపించింది. ఏకగ్రీవమైన 788తో కలిపి, దాదాపు 63 శాతం పంచాయతీల్లో తెరాస మద్దతుదారులే విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 20 శాతం పంచాయతీలను సొంతం చేసుకున్నారు. భాజపా, తెదేపా, సీపీఐ, సీపీఎంలు రెండంకెల సంఖ్యకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా పది జిల్లాల్లో అధికార పార్టీ మద్దతు అభ్యర్థుల విజయం నల్లేరుమీద నడకే అయింది. చాలా జిల్లాల్లో తెరాస మద్దతుదారులకు, కాంగ్రెస్‌ మద్దతు అభ్యర్థులు పోటీ ఇవ్వలేకపోయారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 54, కరీంనగర్‌- 43, ఖమ్మం- 127, మహబూబాబాద్‌-109, మెదక్‌- 124, నల్గొండ- 135, రాజన్న సిరిసిల్ల- 47, సిద్దిపేట-142, వరంగల్‌ గ్రామీణం- 101, అర్బన్‌లో 19 పంచాయతీలను తెరాస మద్దతుదారులే గెల్చుకున్నారు.

ఈ జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులు పదిహేను శాతం పంచాయతీలను కూడా గెల్చుకోలేకపోయారు. కొన్ని జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్‌ పట్టు సాధించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 40, భద్రాచలం-23, జయశంకర్‌ భూపాలపల్లి-45, కామారెడ్డి- 54, మెదక్‌-34, నల్గొండ-38, రంగారెడ్డి-55, సంగారెడ్డి-37, సూర్యాపేట-36, వికారాబాద్‌ జిల్లాలో 51 పంచాయతీలను కాంగ్రెస్‌ మద్దతుదారులు గెల్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో తెదేపా మద్దతుదారులు 19 చోట్ల విజయంసాధించారు. వనపర్తి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్నిపంచాయతీల్లో ఉనికి చాటారు.

కామెంట్‌లు