భ‌క్తుల బాంధ‌వుడు .. న‌డిచే నారాయ‌ణుడు ..!

ఎటు చూసినా జై శ్రీమన్నారాయణ స్మరణ. వేలాది మంది భక్తులు ..లక్షలాది కళ్ళు ..ఒకే చూపై వేచి చూస్తూనే ఉన్నాయి . ఆ స్వరం కోట్లాది ప్రజలను కొన్నేళ్ల నుండీ ప్రభావితం చేస్తూనే ఉన్నది . ఇసుక వేస్తే రాలనంత నిశ్శబ్డం అక్కడ అలుముకుంది. అంతటా ఆ నారాయణుడు ఎలా ఉంటారో చూద్దామనుకుని ఉన్న వాళ్ళు కొందరైతే ..ఇంకొందరు సర్వం ఆయన కోసం అర్పించేందుకు సైతం ముందుకు వచ్చిన వాళ్ళు .అన్ని కులాలకు ..మతాలకు చెందిన వారున్నారు. ఇదంతా కథ కాదు ..ఈ కలియుగంలో ధర్మం కోసం ..అంతరించిపోతున్న విలువల పునరుద్ధరణ కోసం ..మానవులంతా ఒకే సమూహమని ..అదే అంతిమంగా మానవత్వమే తన మతమని చాటి చెబుతున్న ఆధునికత సంతరించుకున్న తేజో మూర్తి ..శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీ.

అన్నార్తులు ..అభాగ్యులు ..ఆదరణకు నోచుకోని వాళ్ళు ..సమస్యలతో వేగలేక తల్లడిల్లుతున్న ఆనాధలు ..జీవితంపై విరక్తి చెందిన వాళ్ళు అంతా ఆయన చల్లని చూపుల కోసం ఎదురు చూస్తుంటారు. సాటి మనుషుల పట్ల ..తోటి జీవుల ..ప్రాణుల పట్ల స్వామిజీకి అపారమైన ప్రేమ .అంతకంటే ఎక్కువగా ఈ ప్రకృతి అంటే వల్లమాలిన అభిమానం . అదే ఆయనను వ్యక్తి నుండి వ్యవస్థగా మార్చేలా చేసింది . దీనజనోద్ధరణే మార్గంగా ..సమాజ హితమే మతంగా ప్రవచించిన ఆచార్యుడు రామానుజాచార్యులు అంటే జీయర్ కు అమితమైన గౌరవం . ఆయనకు ఆయనే ఆదర్శం .మనం కాసిన్ని కాసుల కోసం పోటీ పడతాం . కానీ ఆయన అన్నిటినీ ..అందరినీ ఎప్పుడో వదిలేసుకున్నారు . తన జీవితాన్ని జాతిలో జ్ఞానపు ..సేవా వెలుగులు వెలిగించేందుకు తనను తాను అర్పించుకున్నారు ..ఓ రకంగా త్యాగం చేసుకున్నారు . ఇప్పుడు స్వామిజీకి అరవై ఏళ్ళు . ఈ సమయంలో అంతా ఎందుకురా బతుకు జీవుడా అంటూ టైం పాస్ చేస్తుంటే ..స్వామీజీ మాత్రం సమాజాన్ని చైతన్యం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు .

ఏ ప్రభుత్వం చేయలేని పనిని ..పాలకులు చేయలేని పనుల్ని ఆయన దగ్గరుండి చేసి చూపిస్తున్నారు . అందుకే ఆయన నడిచే దేవుడయ్యాడు . మనం మాత్రం మామూలు మనుషుల్లాగా ఇలా జీవం లేని ప్రాణుల్లాగా మిగిలాం .ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు ..అడుగడుగునా భక్తి ..మూర్తీభవించిన మనుషులు ..ఎవరి లోకంలో వారున్నా .అక్కడంతా జై శ్రీమన్నారాయణ స్మరణే. ఇదంతా చినజీయర్ స్వామీజీ సాధించిన ప్రగతికి సంకేతం .ఇదే ఆదర్శం ..ఇదే కనిపించే దైవం . ప్రతి ఒక్కరిలో ఆరాధన నిండిన భావం. స్వీయ ఆరాధన ..సర్వ ఆదరణ పేరుతో స్వామీజీ యాత్ర సాగుతోంది . బదరీనాథ్ లోని అష్టాక్షరీ క్షేత్రం , తిరుమల , హృషీకేశ్ , శ్రీరంగం, మేల్కోట, భద్రాచలం , నడిగడ్డపాలెం , సీతానగరం ప్రాంతాల్లో నిత్యం అన్నదానం జరుగుతోంది . మార్టూరు లో జీవన్ వికాస్ పేరుతొ పదో తరగతి దాకా ఇక్కడ పిల్లలు చదువుకుంటారు . కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన యోధులకు లక్ష చొప్పున విరాళం అందించారు .

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వామీజీ భక్తులు పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు . శ్రీ కూర్మం నుండి పూరీ దాకా అనావృష్టి నివారణ కోసం చిన జీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో వేద పాదయాత్ర చేపట్టారు . కురుక్షేత్రం నుండి పంజాబ్ లోని బాటలా వరకు ఉగ్రవాద నివారణ కోసం పాదయాత్ర నిర్వహించారు . సామూహిక విరాట్ విష్ణు సహస్ర నామ పారాయణాన్ని సమాజ చైతన్యం కోసం 1994 నుండి భక్తులు జపిస్తూనే ఉన్నారు . కోట్లాది మంది ఇందులో పాల్గొంటున్నారు . గుంటూరు లో 1998 లో నిర్వహించిన విరాట్ పారాయణంలో ఏకంగా 8 లక్షల మంది భాగస్వాములయ్యారు . ఇది ఒక రికార్డ్ గా చెప్పుకోవాలి . 1996 లో కోనసీమలో తుఫాన్ కారణంగా అన్నీ కోల్పోయిన వారిని ఆదుకున్నారు .

వెలుగులు పంచుతున్న జీవా - 53 ఎకరాల సువిశాలమైన ప్రాంగణం . అదే జీవా.. జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక అకాడెమీ ని స్వామీజీ ఏర్పాటు చేసారు . ఇందులో దివ్య సాకేతం, వేదాంత పాఠశాల , నేత్ర విద్యాలయ జూనియర్ , డిగ్రీ కాలేజీలు , గోశాల , జిమ్స్ హాస్పిటల్ , హోమియో మెడికల్ కాలేజీలు ఉన్నాయి . 2009 జూన్ లో దివ్య సంకేతం ప్రారంభమైంది . కుల మతాలకు అతీతంగా గురుకులం విజయవంతంగా నడుస్తోంది . అరుదైన దేశీవాళి గోవులు , దూడల సంరక్షణ తో పాటు గో ఉత్పత్తుల తయారీ జరుగుతోంది . పలు వ్యాధులకు ఇక్కడ మందులు లభిస్తాయి . ఇదే ఇక్కడి ప్రత్యేకత . ఇక జిమ్స్ లో అందరికీ అందుబాటులో హోమియో , ఆయుర్వేద , అల్లోపతి వైద్యం అందుబాటులో ఉంది.

విశ్వశాంతి కోసం గీతామృత దీక్ష స్వామిజీ చేపట్టారు . 700 బృందాలు , ఏక కాలంలో అమెరికాలోని 18 రాష్ట్రాలు , దేశంలోని 3 రాష్ట్రాల్లో పారాయణం చేపట్టారు . ఇందులో లక్షలాది మంది భక్తులు పాలు పంచుకున్నారు . వెలుగులు పంచుతున్న గీతా జ్యోతి . స్వీయ ఆరాధన సర్వ ఆదరణ నినాదంతో 17 వేల గ్రామాల ను చైతన్యవంతం చేశారు . సామూహిక ప్రతిజ్ఞలు చేశారు . ఇదంతా స్వామీజీ ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగింది . 2002 లో చరిత్రలో మొట్టమొదటి సారి మానస సరోవర తీరాన స్వామిజీ బ్రహ్మ యజ్ఞాన్ని నిర్వహించారు . మెగా పశు వైద్య శిబిరాలు చేపట్టారు . ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా పశువులకు వైద్యం అందేలా చేశారు .యువతీ యువకులు వారి కాళ్ళమీద వారు నిలబడేలా ఆదిలాబాద్ జిల్లాలో శిక్షణ ఇప్పించారు . సైకిళ్ళు , మైకులు , కెమెరాలు , ఇతర సామాగ్రిని అందచేశారు . వేదాగమ పాఠశాల 1982 లో ప్రారంభించారు . 2000 మందికి పైగా వేదాలపై పట్టు సాధించారు . ఆత్మవలోకనం పేరుతో అర్చకులందరినీ ఏకతాటిపైకి స్వామిజీ తీసుకు వచ్చారు . అఖిల భారత అర్చక మహా సదస్సు విజయవంతమైంది .

క్యాన్సర్ , అంధత్వ , అవయవ దాన అవగాహన సదస్సులు చేపట్టారు . ఉచితంగా గిరిజన పాఠశాలలను స్వామిజీ ఏర్పాటు చేశారు . అల్లపల్లి , బీర్సాయిపేట , కఠారివారిపాలెం , నేత్ర విద్యాలయం , అంధులకు ఉచితంగా సాంకేతిక విద్య తో పాటు ఉపాధి అందేలా కృషి చేశారు . విశాఖ వారిజలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల , శ్రీరామనగరంలో జూనియర్ కాలేజీ , డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసారు . నడిగడ్డపాలెం లో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు . 5 లక్షల కు పైగా మొక్కలు నాటారు . ఆరోగ్య శిబిరాల ద్వారా 35 లక్షలకు పైగా లబ్ది పొందారు . ఇది కూడా ఓ చరిత్రే. వేద విద్య వ్యాప్తిలో విశేషంగా కృషి చేసిన వారికి 1996 నుండి పలువురికి పురస్కారాలను స్వామీజీ అందించారు . నీటి కొరత తీర్చేందుకు పాడేరులో మూడు వాటర్ ప్లాంట్లు , ఎల్లంపల్లి , బీర్సాయిపేట , కరీంనగర్ , గొల్లపాలెం, సీతానగరం , పోతేపల్లి , శ్రీరామనగరం , వెలిచాల, శంషాబాద్ లలో నీటి పథకాలు ఏర్పాటు చేశారు . కృష్ణం వన్డే జగత్గురుమ్ పేరుతో సామూహిక ప్రార్థన నిర్వహించారు .

మనం బాగుంటే చాలు ..ఇంకొకరితో మనకెందుకు అనుకునే ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం మనం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి . డబ్బులుంటే చాలు అదే లోకమని భ్రమల్లో బతుకుతున్న వారికి స్వామీజీ చేస్తున్న ఈ నిస్వార్థ సేవ కార్యక్రమాలు స్ఫూర్తి కావాలి . దీన జనోద్ధరణ , సమాజ సేవే పరమావధిగా సాగిపోతున్న స్వామిజీ కాలంలో మనమూ బతికి ఉన్నందుకు గర్వపడాలి .అందుకే సర్వసంగ పరిత్యాగి అయిన చినజీయర్ స్వామిజీ ని ఒక్కసారి దర్శించుకోండి . మీకు మీరు అర్థమవుతారు . తోటి వారి పట్ల దయ కలిగి ఉండేలా మారి పోతారు . ఆయన వరాలు కురిపించే దేవుడు కాకపోవొచ్చు ..కానీ అశేష భక్త జనకోటికి మాత్రం ఆయన దివ్య జ్యోతి . భక్తుల బాంధవుడు .నడిచే నారాయణుడు…కాదంటారా ..!

కామెంట్‌లు