విజేతలు..సామాన్యులు
చరిత్ర పుటల్లో మలుపులు ఎన్నో..విజయాలు మరెన్నో. విజయాన్ని చేజిక్కించు కోవాలని..ప్రపంచం నివ్వెర పోయేలా ఏదో సాధించాలన్న కసి ఈ మధ్య యువతరంలో ఎక్కువై పోయింది. రోజుకో టెక్నాలజీలో మార్పులు చోటు చేసుకోవడంతో కొత్త కొత్త ఆవిష్కరణలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. వీటిని నియంత్రించడం ఏ సంస్థకూ చేత కావడం లేదు. మనుషులే పెట్టుబడి. డాలర్ల సంపాదనపైనే గురి. బలమైన బంధాలు మరింత పలుచనై మసకబారి పోతున్నాయి. దీంతో వస్తువులే కొలమానంగా నిలుస్తున్నాయి. విలువలను పెంపొందింప చేసే సామాజిక శాస్త్రాలను పక్కన పెట్టడం పెను సంక్షోభానికి గురి చేస్తోంది. ఇది ప్రమాద సూచికను గుర్తు చేస్తోంది. ఇన్మర్మేషన్ టెక్నాలజీ ఆధిపత్యం చేస్తున్న తరుణంలో సామాన్యులు విజేతలుగా నిలవడం ఇతరులను విస్మయ పరుస్తోంది. దేశ పురోభివృద్ధికి పునాదులు వేసే నాగరికత, సంస్కృతి తన ప్రాధాన్యతను కోల్పోతోంది. వాచ్ డాగ్గా వుండాల్సిన పాలకులు పక్కదారి పట్టడంతో ప్రపంచం ధనార్జనకే పెద్దపీట వేస్తోంది. చమురు, పసిడి, వస్తువుల మాయాజాలం ఊరేగుతున్న లోకంలో అత్యంత సామాన్యులు అసాధారణమైన గెలుపును చేజిక్కించుకున్నారు. దీనిని కాదనలేం. విజయం అంటే విందు భోజనం కాదు..అదొక నిరంతర ప్రక్రియ. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని విజయపు మెట్లు ఎక్కడం. ఇలాంటి సందర్భంలో కొందరికి ఈ లోకం రుణపడి పోయింది. ఇంకొందరు మన మధ్యనే వుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిని స్మరించు కోవడం..గుర్తుకు తెచ్చుకోవడం బాధ్యత కూడా.
అతడి గొంతు బాగోలేదన్నారు. గేలి చేశారు. ఈసడించుకున్నారు. దగ్గరకు రానివ్వలేదు. అయినా వెనుతిరగలేదు. తిరిగి ట్రై చేశాడు. రేడియో స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. వార్తలు చదివే అవకాశం ఇవ్వమని వేడుకున్నాడు. కరుణించలేదు. నీవే ఇలా వుంటే ..నీ స్వరం నీకు అచ్చిరాదన్నారు. కాళ్లు అరిగేలా తిరిగాడు. ఎలాగైనా సరే తానేమిటో నిరూపించు కోవాలని సినిమాల్లో నటించాలని వెళ్లాడు. అక్కడ కూడా అవమానం జరిగింది. పట్టువదల లేదు. గుండె దిటవు చేసుకుని మళ్లీ మళ్లీ ప్రయత్నం చేశాడు. కొందరు ఛీకొట్టారు. ఇంకొందరు వేధించారు. అందరికీ చిరునవ్వే సమాధానం. ఏదో ఒకరోజు తనకు ఛాన్స్ వస్తుందనే నమ్మకం అతడిని అడుగులు వేసేలా చేశాయి. ముందుకే సాగాడు. ప్రపంచం నివ్వెర పోయేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దేశాన్ని తన నటనతో అభినందనలు అందుకున్నాడు. ఏ గొంతు అయితే పనికి రాదని అనుకున్నారో అదే గొంతుతో కోట్లాది రూపాయలు సంపాదించాడు. అతడే ఎవ్వర్ గ్రీన్ హీరో..బాలీవుడ్ సూపర్ స్టార్..అమితాబ్ బచ్చన్. ఆయన మాటలు ఇపుడు రోజుకు కోట్లు కుమ్మరిస్తున్నాయి.
సార్..దగ్గర మంచి ఐడియా వుంది. దానివల్ల సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుంది. ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నన్ను నమ్మండి. నాకు కొంచెం డబ్బులు సాయం చేయండి ..అంటూ వేడుకున్నాడు. ప్రాధేయపడ్డాడు. రోడ్ల వెంట తిరిగాడు. ఆఖరుకు పిచ్చోడి కింద జమ కట్టారు. ఎందుకూ పనికిరాని వాడవని దెప్పి పొడిచారు. తాను కనిపెట్టిన యంత్రం ఏదో ఒకరోజు ఈ ప్రపంచపు మార్కెట్ను శాసిస్తుందని అతడు నోరు బాదుకున్నా వినిపించు కోలేదు. ఒకటా రెండా వందలాది సంస్థల్ని కలిశాడు. అయినా లాభం లేక పోయింది. చూద్దామన్నారు. చేయిచ్చారు. అతడు వెనక్కి చూడలేదు. ఒక సంస్థ మాత్రం కొన్ని కండీషన్స్కు ఒప్పుకుని 1947లో కొంత సాయం చేసింది. అదే మనం రోజూ వాడుతున్న జిరాక్స్ మిషన్. తయారు చేసింది ఓ సామాన్యమైన వ్యక్తి. అతడే చెస్టర్..
అమెరికాను అతడు తన పాటలతో శాసించాడు. ఆ దేశ అధ్యక్షుడి కంటే ఎక్కువగా ఆదరణ పొందాడు. 1954లో జిమ్మీ క్లబ్కు వెళ్లాడు. నేను పాటలు పాడుతా..ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండని వేడుకున్నాడు. కాళ్లు మొక్కాడు. వాళ్లు వినిపించు కోలేదు. చెత్త సింగర్ వంటూ అవమాన పరిచారు. కన్నీళ్లను దిగమింగుకుని 24 గంటలు సాధన చేశాడు. లోకం తన కోసం వేచి చూసేలా చేసుకున్నాడు. అతడే ఎల్వస్ ప్రిస్లీ..కోట్లాది అమ్మాయిలకు అతడు ఆరాధ్య దైవం. ప్రియుడు కూడా..అలాంటి వాడు కావాలని అతడి స్పెర్మ్ కోసం వెయిట్ చేసిన ఘనత ఆ గాయకుడిదే. అతడు మనలాంటి సామాన్యుడే.
తన అందంతో కోట్లాది ప్రజల హృదయాలను కొల్లగొట్టిన మార్లిన్ మన్రో కూడా సామాన్యురాలే. 1944లో ఓ ఏజెన్సీ దగ్గరకు వెళ్లింది. నాకు మోడలింగ్లో ఛాన్స్ ఇవ్వమని. ఓ దర్శకుడు నువ్వు ఎందుకూ పనికిరానివంటూ విసుక్కున్నాడు. బాధ పడలేదు. హాలివుడ్ను తన అందంతో ఊపేసింది. కుర్రకారు గుండెల్ని ఛిద్రం చేసింది. గల్లీలో ఆడిన ఆ కుర్రాడు. సామాన్యమైన తండ్రికి కొడుకు. కానీ అతడి మణికట్టు మాయాజాలం తండ్రిని ఆశ్చర్య పరిచింది. ఏకంగా వస్తూనే భారత క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. మూడు సెంచరీలతో రికార్డు సృష్టించాడు. భారత్కు మరిచిపోని విజయాలను అందించాడు. వ్యక్తిగత జీవితంలో కొన్ని పొరపాట్లు అతడిని దోషిగా నిలబెట్టాయి. మళ్లీ పుంజుకున్నాడు. తనను తాను రీఛార్జ్ చేసుకుని మెరికల్లాంటి క్రికెటర్లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అతడే దేవుడిచ్చిన వరం..అజారుద్దీన్. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్..!
అక్కడ ఇసుక వేస్తే రాలనంత నిశ్శబ్దం. ఒక అసాధారణమైన వ్యక్తి. ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే మ్యాథ్స్ సబ్జెక్టును ఆయన అవలీలగా సూత్రాలను సులభంగా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఆయన చేయని ప్రయోగం లేదు. ప్రపంచం అతడి మేధస్సుకు సలాం చేసింది. పశ్చిమ బెంగాల్కు చెందిన అతడే మహాజన్ మహరాజ్ . అందరూ అతడిని మహరాజ్ ఎంజే అని పిలుస్తారు. ఒక్కసారి చూస్తే చాలు ఆ దివ్యత్వం ..ఆ జ్ఞాన భాండాగారం ..తేజస్సును చూసి మురిసి పోతాం. మైమరిచి పోతాం. అలవోకగా..అద్భుతంగా ..కళ్లకు కట్టినట్టు ..పాఠాలు వల్లె వేస్తారు. ఆధునికమైన లాప్టాప్లు వాడుతారు. తామే గొప్పవారమని మురిసిపోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు..కంపెనీలు..కోట్లతో వ్యాపారం చేసే వాళ్లు..అమెరికన్లు తల దించుకునేలా మరో రామానుజన్..మరో వివేకానందుల వారి ఆహార్యంతో ఎంజే భారత దేశానికి పేరు తీసుకు వచ్చారు.
ప్రతిష్టాత్మకమైన భట్నాగర్ అవార్డు స్వంతం చేసుకున్నారు. అన్ని దేశాల మేధావులను తలదన్ని .. మహరాజ్ ముందు వరుసలో నిలిచారు. ఆయన సీదాసాదా మనిషి. మన ఇంట్లోని మనిషిలా మాట్లాడతారు. గణితంలో..సైన్స్లో ...టెక్నాలజీలో ఏది అడిగినా చిటికెలో ఆన్సర్ చేస్తారు. ఎంజే ముందు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్స్ అప్ ..లో నిమగ్నమయ్యే వేలాది మంది టెక్కీలు అతడిని ఫాలో అవుతున్నారు. ఆయన కార్పొరేట్ కాలేజీల్లో చదువు కోలేదు. రామకృష్ణ మిషన్లో చదువుకున్నారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో పాఠాలు బోధిస్తున్నారు.
సో..కోట్లు కొల్లగొట్టాలంటే మోసం చేయాల్సిన పనిలేదు. ఆస్తులు కూడగట్టాల్సిన పని లేదు. డిఫరెంట్గా ఆలోచించండి. సామాన్యులుగా ఉండండి. అసాధారణమైన విజయాలు సాధించేలా కృషి చేయండి. అదే మీకు బ్రాండ్. కాదంటారా..!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి