విలీనం చేస్తే సంఘాలంటూ వుండవు
ఆర్టీసీని కనుక ప్రభుత్వం విలీనం చేస్తే.. కార్మిక సంఘాలను పూర్తిగా రద్దు చేసుకుంటామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ ఖేల్ ఖతం అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్మికుల మనోభావాలను దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థాయిని మరిచి మాట్లాడటం సీఎంకు తగదని, బెదిరింపులతో కార్మికులను లొంగ తీసుకునే ప్రయత్నం మంచి పద్ధతి కాదన్నారు. సంఘాలు అనేవి కార్మికుల హక్కుల కోసం పోరాడతాయి. కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారు. వారిని సమ్మె విరమించి, విధులకు హాజరవ్వాలని కేసీఆర్ కోరినా.. ఇప్పటి వరకు ఎవరూ విధుల్లో చేరలేదు. ఆర్టీసీకి పల్లె వెలుగు, నగరాల్లో తిప్పే బస్సుల తోనే నష్టాలు వస్తున్నాయి.
ప్రైవేటు బస్సులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిప్పితే, ఆ విషయం తెలుస్తుంది. 26 డిమాండ్లలో కార్మిక సంఘాల నేతల స్వార్థం ఏ మాత్రం లేదు. ఒక వేళ ఉందని నిరూపిస్తే, సమ్మెను ఇప్పటికిప్పుడే విరమిస్తామని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పాత్రలను సమర్పిస్తామని చెప్పారు. అంతే కాకుండా కార్మికుల సమర భేరి సభ తప్పక జరిగి తీరుతుందన్నారు. సమ్మెకు ప్రజాదరణ లేదంటున్నారు సీఎం. ఆయన రవాణా శాఖా మంత్రిగా పని చేశారు. నష్టాల్లో ఉన్న దానిని లాభాల బాట పట్టించారు. ఇదే అంశంపై ప్రజల్లో రెఫరెండం పెడితే అసలు నిజాలు తెలుస్తాయని అశ్వత్థామ రెడ్డి చెప్పారు.
జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల విషయంలో ప్రభుత్వం పథకం ప్రకారమే తప్పుడు విమర్శలు చేస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టిని కలిసేందుకు జేఏసీ నేతలు అసెంబ్లీకి వచ్చారు. పోలీసులు వారిని అనుమతించక పోవడంతో భట్టి అసెంబ్లీ గేటు వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. జేఏసీ కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తనపై కేసు నమోదు గురించి తేలిగ్గా కొట్టి పారేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి