కోటపై కొలువు తీరేదెవ్వరో

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించింది. బీజేపీ నేతలు ఆశించినంత, ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపిన స్థాయిలో మెజారిటీ రాలేదు. బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో  ఎన్నికల్లో బీజేపీ,శివసేన కూటమి 161 సీట్లు, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి 103 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 24 సీట్లలో విజయం సాధించారు. కాషాయ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాలు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్‌ 45, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 54 సీట్లు గెలుచు కున్నాయి. ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ సంచలన కామెంట్స్ చేశారు.

శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేక పోలేదన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం వచ్చే ఐదేళ్లు బీజేపీ, శివసేన కూటమే అధికారంలో ఉంటుందని ప్రకటించారు. మరోవైపు, అధికారాన్ని సమానంగా పంచుకోవాలన్న ఫార్మూలాను శివసేన తెరపైకి తెచ్చింది. కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే దానిపై ఒప్పుకున్నారు అని చెప్పారు శివసేన అధినేత.

సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరించాం. కానీ ప్రతీసారీ అలా బీజేపీకి అవకాశం ఇవ్వలేం. మా పార్టీ కూడా విస్తరించాలి కదా అన్నారు. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఫడణవీస్‌ మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శివసేనతో అధికార పంపిణీకి సంబంధించి ఎన్నికల ముందు చర్చల సందర్భంగా ఏం నిర్ణయించామో..అలాగే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా లాభపడిన పార్టీగా ఎన్సీపీ నిలిచింది.

ఆ పార్టీ గతంలో కన్నా 13 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఫలితాల అనంతరం ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ మాట్లాడుతూ..అధికార అహంకారాన్ని ప్రజలు సహించరని మరోసారి రుజువైందన్నారు. ప్రజలు తమను విపక్షంలోనే ఉండమన్నారని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నించ బోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ఆలోచనను శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తోసిపుచ్చారు. మొత్తంగా చూస్తే కమలం ప్రభావం కొంత మేరకు లేనట్టే కనిపిస్తోంది. 

కామెంట్‌లు