ఆర్టీసీని కాపాడుకోలేమా..?

 భారతదేశంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సంస్థగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పేరున్నది. వేలాది మంది ఈ సంస్థలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఎన్నో కుటుంబాలు దీనినే నమ్ముకుని బతుకుతున్నాయి. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు రోడ్డెక్కారు. శాంతియుతంగా ఆందోళన బాట పట్టారు. పండుగ వేళ పస్తులతో ఉన్నప్పటికీ తమ సమ్మె కొనసాగి తీరుతుందని స్పష్టం చేశారు. గతంలో ఏలిన పాలకులు ఈ సంస్థను జేబు సంస్థగా మార్చేశారు. వందలాది మంది ఇందులో అక్రమంగా కొలువులు పొందారు. తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని, ఆర్టీసీని కోలుకోకుండా చేశారు. దీనిపై ఆజమాయిషీ లేకుండా పోయింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తమ ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ ఏడాది పడుతుంది.

ఈ రాష్ట్రంలో ఎక్కువగా నిబద్దతతో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఆర్టీసీ సంస్థ కార్మికులేనని చెప్పక తప్పదు. ఒకే ఒక్క సంతకంతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలంణగణా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అయినా సర్కారులో మార్పు రాలేదు. సంస్థ నష్టాల్లో ఉందని, అందుకే సగం ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ ప్రకటించారు. దీంతో కార్మికుల నుండి, ఆర్టీసీ కార్మిక నాయకులు, ప్రజా సంఘాల నుండి నిరసన వ్యక్తమైంది. ఆర్టీసీకి 2800 కోట్ల అప్పులు ఉన్నమాట వాస్తవమే, దీనిని పూర్తి చేయడం ప్రస్తుత ప్రభుత్వానికి లెక్క కాదు. కానీ ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించడం అంటే పూర్తిగా ఆర్టీసీని నాశనం చేయడమే.

రాష్ట్రంలోని ప్రతి చోటా, డిపోలకు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 60000 వేల కోట్లు ఉన్నాయని దానిలో ఈ కొద్ది మొత్తం తీర్చడం పెద్ద విషయం కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులకు ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బ్యాంకులను అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఇదే అంశాన్ని యూనియన్ లీడర్లు నిర్ధారించారు కూడా. గత కొన్నేళ్లుగా సంస్థలో ఎందరో రిటైర్ అయ్యారు. వారి స్థానంలో ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. వారి భారం ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పడుతోంది. ఇంత భారం మోస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లభించలేదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు అగ్రభాగాన ఉన్నారు. ఇది కాదనలేని వాస్తవం. ఇప్పటికైనా ఇరువురు పట్టువిడుపు వదిలి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌లు