‘చిప్కో’ను వరించిన ఇందిర అవార్డు
దేశంలో ప్రముఖ సామాజిక వేత్తగా, కార్యకర్తగా పేరొందిన, చిప్కో మూవ్ మెంట్ వ్యవస్థాపకుడు చండీ ప్రసాద్ భట్ కు అరుదైన బహుమతి లభించింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇందిరాగాంధీ అవార్డు వరించింది. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్ళు. జాతీయ సమైక్యతను కాపాడటం, ప్రోత్సహించడంలో ప్రసాద్ చేసిన సేవలకు 2017–18 సంవత్సరానికి గాను ఇందిరా గాంధీ 31వ అవార్డు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం ఈ అవార్డును కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఇందిరా గాంధీ వర్ధంతి రోజు అక్టోబర్ 31న ఢిల్లీలోని జవహార్ భవన్ లో జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 10 లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రం అంద జేస్తారు. ఉత్తరాఖండ్ కు చెందిన భట్..1964లో గ్రామ స్వరాజ్య సంఘ్ ద్వారా చిప్కో మూవ్ మెంట్ ప్రారంభించారు.
1982లో కమ్యూనిటీ లీడర్షిప్ కు గాను ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. అంతే కాకుండా 2013 లో గాంధీ శాంతి బహుమతిని భట్ అందుకున్నారు. 1934 లో ఆయన పుట్టారు. గాంధీయన్ మూవ్ మెంట్ ను ఆయన ముందుకు తీసుకు వెళుతున్నారు. 1964 లో గోపేశ్వర్ లో దశోలి గ్రామ స్వరాజ్య సంఘ్ ను ఏర్పాటు చేశారు. అదే చివరకు చిప్కో ఉద్యమంగా మారింది. 2005 లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. సామాజిక వేత్తగా, పర్యావరణ వేత్తగా భట్ ఎన్నో పోరాటాలు చేశారు. వయసు మీద పడినా ఆయన తన సామాజిక సేవను మానుకోలేదు. జనాన్ని చైతన్యవంతం చేయడంలో ఎనలేని కృషి చేశారు.1956 లో గాంధీయన్ లీడర్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) సమావేశాలకు హాజరయ్యారు. ఆయనను ప్రసాద్ భట్ స్ఫూర్తిగా తీసుకున్నారు.
ఆచరణలో గాంధీజీని, వ్యక్తిత్వంలో జేపీని స్ఫూర్తిగా తీసుకుని చిప్కో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సర్వోదయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ అంతటా చిప్కో మూవ్ మెంట్ వ్యాప్తి చెందేలా చేశారు ప్రసాద్ భట్. సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టారు. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా పోరాడారు. చెట్లను హత్తు కోవడం పర్యావరణాన్ని పరిరక్షించడం దిశగా ప్రయత్నం చేశారు. 2003 లో చిప్కో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. నేషనల్ ఫారెస్ట్ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. అయినా ప్రసాద్ భట్ వెనక్కి తగ్గలేదు. పరిస్థితి అదుపు తప్పడంతో పూర్తి నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. అయినా భట్ తన దారిన తాను వెళుతూనే ఉన్నారు. భట్ కు దక్కిన ఈ గౌరవం దేశంలోని సామజిక కార్యకర్తలకు మరింత బలాన్నిచ్చింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి