వెండి తెరపై గల్లీ బాయ్
బిగ్ బాస్ పుణ్యమా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ అయిపోయిన తెలంగాణ పోరడు, సింగర్ రాహుల్ సింప్లి గంజ్ కు అదృష్టం వరించింది. ఇప్పటికే బిగ్ బాస్ హీరో గా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు త్వరలో బిగ్ స్క్రీన్ మీద అగుపించ బోతున్నాడు. నిన్న మొన్నటి దాకా తన స్నేహితులతో కలిసి పాతబస్తీ వీధుల్లో తిరిగిన ఓ గల్లీబాయ్కి బిగ్స్క్రీన్పై నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తొలుత ప్లేబ్యాక్ సింగర్గా చిత్ర సీమకు పరిచయమైన ఈ కుర్రాడు బిగ్బాస్ తెలుగు సీజన్–3 విజేతగా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. నాలుగైదు వారాల నుంచి యూట్యూబ్ స్టార్గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
ప్రముఖ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ రాహుల్ను వెండి తెరకు పరిచయం చేస్తూ సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. పక్కా లోకల్ బాయ్గా అభిమానులకు దగ్గరైన రాహుల్కు ఈ అవకాశం నిజంగా వరమనే చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అగ్రనటులు ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నిన్నటి దాకా బుల్లి తెరపై సందడి చేసిన రాహుల్ ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుని అశేష అభిమానాలను సొంతం చేసుకున్నాడు. స్వతహాగా గాయకుడైన ఇతడు ఇప్పుడు నటుడిగా మారు తుండటంతో అటు పాతబస్తీతో పాటు ఇటు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అటు ట్విట్టర్లోనూ ఇటు ఇన్స్ట్రాలోనూ రాహుల్ అభిమానులు తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి సింప్లి గంజ్ సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. రమ్యకృష్ణ, ప్రకాష్రాజ్ లాంటి సీనియర్ నటులతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా రాహుల్ పేర్కొన్నాడు. షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, నటుడిగా వెండి తెరకు పరిచయం అవ్వడం నిజంగానే ఆనందంగా ఉందని మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరాడు. తన పాటలతో యువత మనసు దోచుకున్న నేను నటుడిగా మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతున్నానని చెప్పాడు.
బిగ్బాస్ 3 విజేతగా నిలిచిన రాహుల్ రాత్రికిరాత్రే స్టార్గా మారి పోయాడు. గాయకుడిగా ఉన్నప్పుడు కొంత మంది అభిమానులను కలిగి వున్న ఇతడు బిగ్బాస్ తర్వాత లక్షలాదిగా వ్యూవర్స్ సొంతమయ్యారు. యూట్యూబ్లో అత్యధికంగా సెర్చ్ చేస్తున్న వారిలో రాహుల్ ఇప్పటికే అందరి కంటే ముందున్నాడు. ఓ సాధారణ గల్లీ బాయ్గా తిరిగిన రాహుల్ ఇప్పుడు సెలబ్రిటీగా అందరి మన్ననలు పొందాడు. గత నెల 29న పీపుల్స్ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో తన పాటలతో అదరగొట్టగా ఆ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. మొత్తం మీద సింప్లి గంజ్ కు అదృష్టం ఈ రూపంలో వచ్చిందన్న మాట.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి