టెలికం కంపెనీలకు ఏజీఆర్ ఝలక్

ఇండియాలో ఇప్పటికే టెలికం సెక్టార్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రైవేట్ టెలికాం కంపెనీలకు కోలుకోలేని రీతిలో భారత అత్యున్నత న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది. ఏజీఆర్‌ కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెను భారంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా 50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ  23,045 కోట్ల నికర నష్టాల్ని  ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా  74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.

ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది. టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం 2019–20 త్రైమాసిక కాలానికి భారీగా నష్టాలు వచ్చాయి. కంపెనీకి ఈ క్యూ2లో అత్యధిక స్థాయిలో నష్టాలు తప్పలేదు. గత క్యూ2లో 119 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో 23,045 కోట్ల నష్టాలు వచ్చాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ క్యూ2లో ఆదాయం 5 శాతం వృద్ధితో  21,199 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

కొత్త అకౌంటింగ్‌ విధానాలను అనుసరించినందువల్ల గత క్యూ2, ఈ క్యూ2 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. తాజాగా ఇచ్చిన తీర్పు కారణంగా స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు, లైసెన్స్‌ ఫీజు తదితర అంశాలకు సంబంధించి ఈ క్యూ2లో ఈ కంపెనీపై  28,450 కోట్ల భారం పడిం ది. దీంతో కంపెనీ నికర నష్టాలు 23,045 కోట్లకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక నష్టం. ఏజీఆర్‌ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు 1,123 కోట్లుగా ఉండగా, నిర్వహణ లాభం 6,343 కోట్ల నుంచి 8,936 కోట్లకు పెరిగింది. భారత విభాగం ఆదాయం 3 శాతం పెరిగి 15,361 కోట్లకు చేరింది. ఏజీఆర్‌ దెబ్బకు వొడాఫోన్‌ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం భారీ నష్టాలను ప్రకటించింది.

ఈ క్యూ2లో  50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఇంత వరకూ ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించ లేదు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో తమ నష్టాలు 4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఇక ఆదాయం 42 శాతం ఎగసి 1,146 కోట్లకు పెరిగిందని వివరించింది. తాము చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు  44,150 కోట్లుగా ఉంటాయని అంచనా వేసిన వొడాఫోన్‌ ఐడియా, ఈ క్యూ2లో  25,680 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. టెలికం విభాగం తాజా అంచనాల ప్రకారం, ఏజీఆర్‌కు సంబంధించి ఎయిర్‌టెల్‌  62,187 కోట్లు, వొడాఫోన్‌ ఐడియాలు 54,184 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఈ బకాయిలను 3 నెలల్లోగా చెల్లించాలని సుప్రీం  తన తీర్పులో పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులో గానే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం టెలికం కంపెనీలు ప్రభుత్వానికి 1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. కాగా ఏజీఆర్‌కు సంబంధించి స్పష్టత లేదంటూ గత నెలలోనే వెల్లడించాల్సిన ఆర్థిక ఫలితాలను ఎయిర్‌టెల్‌ వాయిదా వేసింది. ఏజీఆర్‌ విషయమై ఒక రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్‌ ఐడియా సన్నాహాలు చేస్తోంది. మొత్తం మీద ఎజిఆర్ దెబ్బకు టెలికం కంపెనీలు అబ్బా అంటున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!