దీపక్ దెబ్బకు ఠారెత్తిన బంగ్లా


యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ టీ20ల్లోనే అత్యుత్తమ బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లతో విజృంభించడంతో భారత్‌ చివరి టీ20లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. బంగ్లాను 30 పరుగుల తేడాతో ఓడించి మూడు టీ20ల సిరీ్‌సను 2-1తో కైవసం చేసుకుంది. శ్రేయాస్‌ అయ్యర్‌ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 ధనాధన్‌ ఇన్నింగ్స్‌తోపాటు కేఎల్‌ రాహుల్‌  7 ఫోర్లతో 52 పరుగులతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

సౌమ్యా సర్కార్‌, షఫియుల్‌ చెరో రెండు వికెట్లు పడ గొట్టారు. ఛేదనలో దీపక్‌ చాహర్‌ నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్‌ 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మహమ్మద్‌ నయీమ్‌ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసినా ఫలితం లేక పోయింది. ఈ మ్యాచ్‌లో క్రునాల్‌ పాండ్యా స్థానంలో మనీష్‌ పాండేను టీమ్‌లోకి తీసుకున్నారు. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన దీపక్‌ చాహర్‌కు మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు దీపక్‌ చాహర్‌ ఆరంభంలోనే ఝలక్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్‌ లిటన్‌దా్‌స తో పాటు సౌమ్యా సర్కార్‌ ను అవుట్‌ చేశాడు. మిథున్‌ను అవుట్‌ చేసిన చాహర్‌.. మూడో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని విడ దీశాడు.

ఆ వెంటనే ముష్ఫికర్‌ ను దూబే స్లో బంతితో బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేసి పరుగులు కట్టడి చేశారు. 28 బంతుల్లో 49 పరుగులు కావాల్సిన సమయంలో డేంజర్‌ మ్యాన్‌ నయీమ్‌ను దూబే అద్భుతమైన యార్కర్‌తో బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ను టీమిండియా వైపు మొగ్గేలా చేశాడు. తర్వాతి బంతికి ఆఫిఫ్‌ హుస్సేన్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో డకౌట్‌ చేశాడు. మహ్మదుల్లాను చాహల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయగా,షఫియుల్‌, ముస్తాఫిజుర్‌, అమినుల్‌ను దీపక్‌ చాహర్‌ వరుసగా అవుట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. రోహిత్‌ను ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ లోనే షఫియుల్‌ బౌల్డ్‌ చేయగా, మరో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ను ఇస్లామ్‌ బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌తో కలిసిన కేఎల్‌ రాహుల్‌ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, అర్ధ శతకంతో జోరు మీదున్న రాహుల్‌ను అల్‌ అమీన్‌ దెబ్బ కొట్టాడు. దీంతో మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో స్కోరు బోర్డు నడిపించే బాధ్యతలను అయ్యర్‌ భుజాన వేసుకున్నాడు.

స్పిన్నర్‌ ఆఫిఫ్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో టీ20ల్లో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. కానీ, 16వ ఓవర్‌ తొలి బంతికే పంత్‌ను సర్కార్‌ బౌల్డ్‌ చేయడంతో.. నాలుగో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో 5 పరుగుల తేడాతో అయ్యర్‌ కూడా సౌమ్య బౌలింగ్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. అయితే, సిరీ్‌సలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న మనీష్‌ పాండే 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో టీమిండియా స్కోరు 170 పరుగుల మార్క్‌ దాటింది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!