భగీరథ అద్భుతం..ఇక దేశ వ్యాప్తం


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర సర్కార్ ప్రసంశలు కురిపించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రభుత్వ కృషిని కొనియాడారు. అంతే కాదు ఇదే పథకాన్ని దేశమంతటా విస్తరించేలా చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచి నీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతోపాటు, మురుగు నీటిని ట్రీట్‌ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహోప యోగానికి ఉపయోగించే విధానాలు అవలంబించాలని కేంద్ర మంత్రి సూచించారు.

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం గురించి షెకావత్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్‌ భగీరథ స్వరూపాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతి రోజూ మంచి నీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం చేపట్టాం. రాష్ట్రంలో చాలా చోట్ల మంచి నీటికి తీవ్రమైన ఎద్దడి, ఫ్లోరైడ్‌ సమస్య ఉండేది. అసలు తాగునీళ్లే దొరకక పోయేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే వారు.

అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. పథకం దాదాపు పూర్తయింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని, అప్పటి అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశాం. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచి నీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడొద్దు అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.

ఇదే సమయంలో దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తోంది. మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి అని సీఎం కోరారు. 11వ శతాబ్ధంలోనే కాకతీయలు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు. పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!