టీమిండియాదే టెస్ట్ సిరీస్

విరాట్ కోహ్లీ నాయకత్వం లోని భారత జట్టు స్వదేశం లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. పూణే వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఫాలో ఆన్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా ను 67.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్‌ చేసి మ్యాచ్‌ గెలుపొందింది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగి పోవడంతో సఫారీల ఇన్నింగ్స్‌ టీ బ్రేక్‌ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌ ౪౮ పరుగులు చేయగా, బావుమా 38 , ఫిలిండర్‌ 37, మహరాజ్‌ 22 మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా పెవీలియన్ బాట పట్టారు. దీంతో   కోహ్లి టీమ్ ఇన్నింగ్స్‌137 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.

ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్, కోహ్లీ, పుజారా, రెహానే లు రాణించడంతో భారీ స్కోర్ చేసింది. సౌత్ ఆఫ్రికా ఫాలో ఆన్ ఆడింది. ఇక దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మార్కరమ్‌ను తొలి వికెట్‌గా ఇషాంత్‌ ఔట్‌ చేస్తే, డిబ్రుయిన్‌ ను ఉమేశ్‌ యాదవ్‌ బోల్తా కొట్టించాడు. సాహా అద్భుతమైన క్యాచ్‌తో డిబ్రుయిన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 21 పరుగులకే సఫారీలు రెండు వికెట్లు కోల్పోగా డుప్లెసిస్‌ అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఆపై ఎల్గర్‌, డీకాక్‌, బావుమాలు పెవిలియన్‌బాట పట్టారు. ఇబ్బందుల్లో పడిన సమయంలో మహరాజ్‌, ఫిలిండర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది.

57 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ఫిలిండర్‌ ఔట్‌ కాగా, ఆపై కాసేపటికి రబడా పెవిలియన్‌ చేరాడు.
చివరి వికెట్‌గా మహరాజ్‌ ఔట్‌ కావడంతో భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం దక్కింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు తలో మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ రెండు వికెట్లు తీశాడు. షమీ, ఇషాంత్‌లకు చెరో వికెట్‌ దక్కింది.  ఈ టెస్టులో విజయంతో భారత్‌ సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌  మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో భారత్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక రాంచీలో మూడో టెస్ట్ లాంఛనంగా జరగనుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!