ద్రవ్య లోటుపై రాజన్ ఆవేదన

నిన్నటి దాకా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ చిలుక పలుకులు పలుకుతూ జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. కానీ బయటకు అంతా సవ్యంగానే ఉందని అగుపిస్తున్నా లోలోపట మాత్రం భారతీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారి పోయిందని విపక్షాలు, ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మోడీ పట్టించు కోవడం లేదు. ఇదే సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టార్ ప్రమాదకరంగా తయారైందని హెచ్చరించారు. భారత ద్రవ్య లోటు సవ్యంగా లేదని స్పష్టం చేశారు.

బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి రాజన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆసియాలోనే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2016లో భారత వృద్ధి రేటు 9 శాతం ఉండగా, క్రమ క్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడి పోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటోందని రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ల పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యమిస్తుందని అన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. విదేశీ పోటీని ఆహ్వానించాలని, కొందరు వాదిస్తున్నట్లుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం విఘాతం కలగదని పేర్కొన్నారు. మొత్తం మీద రఘురాం రాజన్ హెచ్చరికలు జారీసినా కమల సర్కార్ పట్టించుకోక పోవడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థికవేత్త సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటే మేలు జరిగే ఛాన్స్ ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!