అంతటా ఆధారమే..లేదంటే భారమే
కేంద్రంలో బిజెపి కొలువు తీరాకా ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి పనికి ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. అది లేకుంటే బతకలేమనే స్థితికి తీసుకు వచ్చారు మోడీ అండ్ అమిత్ చంద్ర షా. దీంతో బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఆధార్ నమోదును తమ భుజానికి ఎత్తుకున్నాయి. ఇదో ప్రహసనంగా మారింది. తాజాగా 30 మంది లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా సరే ఆధార్ కోసం వెయిట్ చేస్తే, ఈ విషయాన్ని పోస్టల్ అధికారులకు తెలియ పరిస్తే నేరుగా సిబ్బందిని మన ఇళ్ల వద్దకే పంపిస్తారు. ఇదో వినూత్న ప్రయత్నం. పోస్టల్ శాఖ ఇతర శాఖలతో పోటీ పడుతోంది. సరికొత్త సేవలతో ముందుకు వస్తోంది.
ఉత్తరాలు, పోస్టు కార్డులు చేర వేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తపాలా శాఖ ఆధార్ సేవలూ అందిస్తోంది. ఆధార్ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు..డోర్ వద్దకు వచ్చి సేవలందించనుంది. రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్ శాఖ ఆధార్ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్తో అనుసంధానం చేయడంతో ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరిగా మారింది.
ఇప్పటికే కొత్తగా పుట్టిన శిశువులు, చిన్నారులు మినహా దాదాపు ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ పేరు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు, సవరణలు, చిరునామాలు, మొబైల్ నెంబర్ల లింకేజీ, మార్పు కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీయక తప్పడం లేదు. దీంతో ఆధార్ కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. ఆధార్ అప్డేషన్ కోసం బయోమెట్రిక్ తప్పనిసరి. ఆధార్ వివరాలు నమోదు అనంతరం ఆథరైజ్ సిబ్బంది, కార్డుదారుడి బయోమెట్రిక్ ఆమోదం అనంతరమే యూఐడీఏఐ ప్రధాన సర్వర్ అప్డేషన్కు అనుమతిస్తుంది. మొబైల్ నెంబర్కు వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ ఆధారంగా చేర్పులు, మార్పులు పూర్తి చేస్తారు.
అనంతరం అప్డేషన్ ప్రక్రియ పూర్తయినట్లు మొబైల్కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ తతంగం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. అనంతరం యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి ఈ–ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోస్టల్ ఆధార్ కేంద్రాల ద్వారా సుమారు 16,271 మంది కొత్తగా ఆధార్ నమోదు చేసుకోగా 1,30,996 మంది తమ ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి సేవలు ఉండగా త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి