బెట్టు వీడండి ..మెట్టు దిగండి..తగ్గితే తప్పేమిటి..హైకోర్టు

గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయినా చర్చలకు పిలవాల్సింది పోయి, సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. ఇరువురూ మెట్టు దిగడం లేదు. ఓ వైపు కార్మికులు ఇంకో వైపు ప్రభుత్వం మధ్య ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ఇరువురికి తెలుసు. కార్మికులు సమ్మె చేయడం అన్నది వారి హక్కు. కాదనలేం. సెల్ఫ్ డిస్మిస్ అన్న పదం ఏ డిక్షనరీలో లేదు. చేసిన పనికి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో ఎండీని నియమించలేదు. ఇంకో వైపున ప్రైవేట్ వాహనాల కోసం టెండర్లు పిలిచామని చెబుతున్నారు. ఇదెలా సాధ్యమని కోర్టు ఆర్టీసీ సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా ఎంత కాలం జరుగుతుంది.

దీనికి పరిషాకారం మార్గం చూపించాల్సింది ప్రభుత్వమే. ప్రజలు మౌనంగా ఉన్నారని అనుకుంటే పొరపాటే. వారి ఆగ్రహం మంచిది కాదు. దీనిపై దృష్టి సారించి, కార్మికులతో చర్చలు జరపండి. ఇరు వర్గాలు పట్టు విడుపుల ధోరణితో వ్యవహరించాలని, ఇద్దరూ ఒక మెట్టు దిగాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం చర్చల ప్రక్రియను పర్యవేక్షించాలని, చర్చల ద్వారానే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలన్న ఈ నెల 18 నాటి హైకోర్టు ఉత్తర్వులు అధికారికంగా వెలువ డ్డాయి. ఆ ఉత్తర్వుల ప్రతి ప్రభుత్వానికి అందింది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్, జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ చర్చలు జరపాలని ధర్మాసనం ఆదేశించింది.

ఈనెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలు ఫలప్రదమై ఆర్టీసీ సమ్మె విరమణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సమ్మెలోకి వెళ్లిన కార్మిక సంఘాలు లేవనెత్తిన పలు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడి పడినవి కావని, వీటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరిపి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయ పడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో ఆర్థిక అంశాలను సంబంధం లేని వాటిని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడదని వ్యాఖ్యానించింది. ఆర్థిక అంశాలతో ముడిపడిన కొన్ని డిమాండ్లు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా, చట్టపరంగా చెల్లించాల్సిన వేనని పేర్కొంది.

రాజ్యాంగంలోని 14, 15, 16, 19, 21 అధికరణాల ప్రకారం ఈ డిమాండ్లు ఆమోదించ దగ్గవని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఆర్టీసీ చట్టం 1950లోని సెక్షన్‌ 19(1)(సి), ఇతర సెక్షన్ల ప్రకారం ఆర్టీసీ సిబ్బందికి పని చేసేందుకు ఆరోగ్యకర వాతావరణం, తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉంది. కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించే నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోర్టు తన న్యాయ పరిధికి లోబడి ఉంది. సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!