ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ క్లోజ్

భారతీయ ఆర్ధిక రంగం ఎన్నడూ లేని రీతిలో కుదుపునకు లోనవుతోంది. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన పేమెంట్స్ బ్యాంకులన్నీ ఇప్పుడు మోడీ తీసుకున్న నోట్ల రద్దు దెబ్బకు దివాళా అంచున నిలబడ్డాయి. ఇప్పటికే కొన్ని పేమెంట్స్ బ్యాంకులు తీవ్ర నష్టాలతో ఒడిడుకులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా మరో పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేతకు సిద్ధమైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌కు తాజాగా ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్‌ ఈ ఏడాది సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేసిందని ఆర్‌బీఐ పేర్కొంది.

ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్‌ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్‌ నియమించిందని వివరించింది. అయ్యర్‌ డెలాయిట్‌ టచ్‌ తొమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీలో సీనియర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించ లేమని, స్వచ్ఛంద మూసివేతను జూలై లోనే ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 2015 ఆగస్టులో ఆర్‌బీఐ మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాల లైసెన్స్‌లను ఇచ్చింది.

గత ఏడాది ఫిబ్రవరిలో ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. నాలుగో కంపెనీ పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ రంగం నుంచి వైదొలగిన నాలుగో కంపెనీగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ నిలిచింది. గతంలో  దిలిప్‌ సంఘ్వి, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, టెలినార్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ల కన్సార్షియంతో పాటు టెక్‌ మహీంద్రా, చోళ మండలం ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈ రంగం నుంచి వైదొలిగాయి.

కామెంట్‌లు