సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్ లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ వంటి ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా షేర్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌  లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 71.86కు చేరినప్పటికీ, మన మార్కెట్‌ ముందుకే దూసుకు పోయింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,816 పాయింట్లను తాకిన సెన్సెక్స్‌ చివరకు 182 పాయింట్ల లాభంతో 40,652 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపునకు 2 పాయింట్లు తక్కువ. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌కు ఒక పాయింట్‌ తక్కువగా 11,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 99 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, చివరకు 59 పాయింట్ల లాభంతో సరి పెట్టుకుంది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో 346 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్‌ హై, 40,816 పాయింట్లను తాకింది. సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైకు చేరడం, నిఫ్టీ ఇంట్రాడేలో 12,000 పాయింట్ల ఎగువకు ఎగ బాకడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో మధ్యాహ్న లాభాలు తగ్గాయి. ఇంధన, ఫార్మా, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు లాభపడగా,రియల్టీ, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లు నష్ట పోయాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఇంట్రాడేలో 4.1  శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి 1,572ను తాకిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చివరకు 2.4 శాతం లాభంతో 1,547 వద్ద ముగిసింది. ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్‌ జియో టారిఫ్‌లను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఈ షేర్‌ జోరుగా పెరిగింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 10 లక్షల కోట్ల మార్క్‌కు చేరువైంది. మార్కెట్‌ ముగిసే నాటికి 9,80,700 కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ గల భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 9,96,415 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఈ షేర్‌ 37 శాతం లాభ పడింది. 

కామెంట్‌లు