అబ్బా..ట్రాయ్ దెబ్బ

తమ చేతుల్లో ఉన్నారు కదా అని అడ్డగోలుగా యూజర్ చార్జీలు పెంచుకుంటూ వెళుతున్న కేబుల్ ఆపరేటర్స్ కు ట్రాయ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే చార్జీల మోతతో ఇబ్బందులు పడుతున్న కేబుల్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో కేబుల్ బిల్లులు తగ్గనున్నాయి. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్‌ కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీనికి సంబంధించి ఎంఎస్‌వోలకు ట్రాయ్‌ కొత్త గైడ్‌లైన్స్‌‌ను కూడా విడుదల చేసింది. తద్వారా కేబుల్‌ టీవీ ఆపరేటర్లకు భారీ షాకిచ్చింది.బ్రాడ్కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను 19 నుంచి12కు తగ్గించింది. అలాగే నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు ను 130 గా నిర్ణయించింది.

ఈ నిబంధనలు మార్చి1 నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు ఈ కొత్త  నిబంధనలను ఈ  నెలాఖరు నాటికి వెబ్‌సైట్‌లో ఉంచాలని కూడా ఎంఎస్‌వోలను ఆదేశించింది. తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ ఛానళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్‌ 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి ఎన్‌సీఎఫ్‌లో 40 శాతం చొప్పున అదనంగా వసూలు చేసు కోవచ్చని తెలిపింది. దీన్ని 200 చానెళ్లకు 130గా సవరించింది. అంతేకాదు.. 200కు మించి ఎన్ని ఫ్రీ ఛానల్స్‌కి అయినా..160కి మించి చెల్లించ నక్కర్లేదని స్పష్టం చేసింది. సమాచార మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా ప్రసారం చేయాలని నిర్ధారించిన ఛానెళ్లను ఎన్‌సీఎఫ్‌లో చానెళ్ల కింద లెక్కించ కూడదని తెలిపింది.

డీడీ ఛానల్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. 26 డిడి చానల్స్ టారీఫ్‌లో కాకుండా అదనమని ట్రాయ్‌ పేర్కొంది. ఆరు నెలలకు అంతకు మించిన దీర్ఘకాలిక సబ్‌స్క్రిప్షన్స్‌కు డీపీఓలు డిస్కౌంట్లు ఆఫర్‌ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. డీపీఓలు వసూలు చేసే ఫీజుపై నెలకు 4 లక్షల పరిమితి విధించింది. దీంతో పాటు ఆల్‌కార్ట్‌ ఛానల్స్, ఎలక్ట్రానిక్‌ ప్రోగ్రామ్‌ గైడ్‌, చానెల్‌ బొకెట్‌ తదితరాలకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు తెస్తున్నట్లు ట్రాయ్‌ తెలిపింది. దీంతో ఎంఎస్ఓ లు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!