ఆశాజనకంగా జీఎస్టీ వసూళ్లు

ఓ వైపు ఆర్ధిక మాంద్యం దేశాన్ని కుంగదీస్తుంటే మరో వైపు వస్తు సేవల పన్ను వసూళ్లు లక్ష్యానికి మించి పోవడం అటు ఆర్థికరంగ నిపుణులను, ఇటు మార్కెట్ వర్గాలు విస్తు పోయేలా చేశాయి. ఇది కొత్త ఏడాదిలో శుభ పరిణామంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక రంగం పూర్తిగా దివాళా అంచున నిలబడింది. ఇదే విషయం గురించి ప్రపంచ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ హెచ్చరించింది కూడా. అయినా భారత ప్రభుత్వం లో ఇసుమంత చలనం కనిపించలేదు. నిరుద్యోగిత పెరగడం, ఉత్పాదకత తగ్గడం, ఆర్థిక వృద్ధి రేటు అనూహ్యంగా దిగజారడం కూడా ఫైనాన్షియల్ సెక్టార్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

అయితే అనుకోని రీతిలో వస్తు, సేవల పన్ను  వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో నెలలో 1 లక్ష కోట్ల మైలు రాయిని దాటాయి. డిసెంబర్‌లో . 1,03,184 కోట్ల మేర జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. అంత క్రితం నవంబర్‌ నెలలో ఈ వసూళ్లు 1,03,492 కోట్లు. గతేడాది జూలైలో 1.02 లక్షల కోట్లు నమోదు కాగా, 2018 డిసెంబర్‌లో 94,726 కోట్లు వసూలయ్యాయి.  నిబంధనలను పాటించే విధానం, వినియోగం మెరుగు పడుతున్నా ..యనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2018 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో దేశీయంగా లావాదేవీలపై జీఎస్‌టీ వసూళ్లు 16 శాతం వృద్ధి నమోదు చేశాయి.

 వసూలైన1,03,184 కోట్లలో.. సీజీఎస్‌టీ భాగం 19,962 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ 26,792 కోట్లు, ఐజీఎస్‌టీ 48,099 కోట్లు, సెస్సు  రూపేణా 8,331 కోట్లుగా ఉన్నాయి. ద్రవ్య లోటు కట్టడీలో ఉండాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా నెలల్లో కూడా ఇదే తరహాలో వసూళ్లు కొనసాగాల్సి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వార్షిక లక్ష్యం స్థాయిని అందు కోలేక పోయినా.. ఇక నుంచి వసూళ్లు స్థిరంగా మెరుగు పడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో ప్రతి నెలా లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని కేంద్రం పెట్టుకుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!