ధరల మోత జనానికి వాత
కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి పోయిన జనానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రవాణా రంగానికి చెందిన ఆర్టీసీ బస్సుల చార్జీలను ఇష్టానుసారం పెంచింది. మరో వైపు ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైల్వే శాఖ తానేమీ తక్కువ కాదంటూ కొత్త ఏడాదిలో కోలుకోలేని ఝలక్ ఇచ్చింది ప్రయాణీకులకు. భారీగా పెంచింది. ఇదిలా ఉండగా విమాన ఇంధనం ధరలతో పాటు, వంట గ్యాస్కు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు రేట్లను సవరించాయి.
దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటర్ ధర1,637 పెరిగి 64,324 అయింది. నెల వ్యవధిలో ఏటీఎఫ్ ధరలను పెంచడం ఇది రెండోసారి. డిసెంబర్ 1న కూడా కిలోలీటర్పై రూ.14 వరకు పెరిగింది. తాజా సవరణతో ఏటీఎఫ్ ధరలు 2019 జూన్ తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. తీవ్ర పోటీ వాతావరణం, టికెట్ చార్జీల పెంపు విషయంలో పరిమితులతో నష్టాలను చవి చూస్తున్న ఎయిర్లైన్స్ కంపెనీలకు ఇంధన ధరల పెరుగుదల మరింత ప్రతికూలం కానుంది. ప్రతి రోజు ప్రజలు గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధర కూడా పెంచింది. సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను 695 నుంచి 714కు ఆయిల్ సంస్థలు పెంచేశాయి.
గత సెప్టెంబర్ నుంచి వరుసగా నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుతూనే ఉండడం గమనార్హం. గడిచిన ఐదు నెలల్లో సబ్సిడీ లేని ఒక్కో సిలిండర్ ధర నికరంగా139.50 పెరిగింది. ఒక ఏడాదిలో ఒక వినియోగదారుడు 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు అర్హులు. ఆ తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లకు మార్కెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన నెలలో అంతర్జాతీయ రేట్ల సగటు ఆధారంగా మరుసటి నెల మొదటి తారీఖున ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను పెంచడం జరుగుతోంది.
ఇక ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే లీటర్ కిరోసిన్ ధర 26 పైసలు పెరిగి ముంబైలో 35.58కు చేరింది. కిరోసిన్పై సబ్సిడీ పూర్తిగా తొలగి పోయే వరకు ప్రతీ నెలా 26 పైసల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం గమనార్హం. కొత్త ఏడాది సంబురం ఆవిరి అయ్యేలా బీజేపీ ప్రభుత్వం జనం నడ్డి విరిచేసింది. రాబోయే రోజుల్లో ఇంకేం పెంచుతుందో వేచి చూడాలి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి