మనసే కీలకం..జీవితం ఆనందం

అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ఆమెకు మంచి స్టార్ డమ్ ను తీసుకు వచ్చింది. మిగతా నటీమణుల్లాగా ఆమె అందాల ప్రదర్శనకు ఒప్పుకోరు. వాటికి చాలా దూరంగా ఉంటారు. పూర్తిగా ఇండిపెండెంట్ మనస్తత్వం కలిగిన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాయిపల్లవి ఆలోచనలు, ఆచరణలు కాస్త భిన్నంగా ఉంటాయి. డాక్టరు కావలసింది, అనుకోకుండా యాక్టర్‌ అయ్యిందీ చిన్నది. మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతో కథానాయకిగా రంగ ప్రవేశం చేసిన ఈ సహజ నటి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌ లలో అవకాశాలు దక్కించుకుంది.

టాలీవుడ్‌ ఆదరించినంతగా కోలీవుడ్‌ సాయి పల్లవిని అక్కున చేర్చుకోలేక పోయింది. కారణాలేమైనా ఆమె నటించిన మూడు తమిళ సినిమాలు ఆశించిన సక్సెస్ అందు కోలేదు. ధనుష్‌ తో జంటగా నటించిన మారి–2 చిత్రం కాస్త ఆడింది. దయా చిత్రం పూర్తిగా నిరాశ పరచగా, ఇక స్టార్‌ హీరో సూర్యతో నటించిన ఎన్‌జీకే చిత్రం సాయిపల్లవి కెరీర్‌కు ఏ మాత్రం ప్లస్‌ అవలేదు. కోలీవుడ్‌లో మరో అవకాశం కూడా రాలేదు. ఇక తెలుగులో హిట్స్‌ ఉన్నాయి, చాన్స్‌లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ అమ్మడికి చాలా పాఠాలు నేర్పాయి. జీవితంలో అనుకున్నది జరగక పోతేనో, చేసిన పనికి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడో నిరాశకు గురవడం సహజం అని అంది.

అయితే అలాంటి వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది. ఏదైనా జరగాలని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరంది. అందుకే అలాంటి సమస్యలు ఎదురైతే అందులోంచి కొత్త విషయాలను నేర్చుకోవాలని పేర్కొంది. అంతేగానీ ఆశించింది జరగలేదే అని నిరుత్సాహ పడకూడదని చెబుతోంది. ఏం జరిగినా మన మంచికే అని భావించడం తనకు చదువుకునే రోజుల నుంచే అలవాటైందని చెప్పింది. ఆ అలవాటు ఇప్పుడు ఈ రంగంలో హెల్ప్‌ అవుతోందని అంటోంది ఈ అమ్మడు. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే మనం పాఠం నేర్చుకోవడానికే అది జరిగిందని భావిస్తానని పేర్కొంది.

గతంలో 2 కోట్లు పారితోషకాన్ని ఇస్తామని ఓ ఫేస్‌ క్రీమ్‌ సంస్థ ఆఫర్‌ ఇచ్చినా సారీ అనేసిన విషయం తెలిసిందే. సహ నటీమణులు చాలా మంది వాణిజ్య ప్రకటనలో నటించి సంపాదించు కుంటుంటే సాయి పల్లవి ఎందుకో ఆ రంగంలో విముఖత చూపిస్తోంది. ఇక డబ్బు కోసం ఏది పడితే ఆది చేయనని గతంలోనే తేల్చి చెప్పేసింది. ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటామా.. సంతోషంగా, ఆత్మ సంతృప్తితో జీవిస్తే చాలు.

నా విలువలు చంపుకుని పని చేయడం నాకు నచ్చదు. అందుకే ఇటీవలే కొన్ని యాడ్స్‌ను రిజెక్ట్‌ చేశాను అని స్పష్టం చేసింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న విరాటపర్వం చిత్రంలో  హీరోయిన్‌గా నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. డబ్బుల వెంట పరుగెత్తకుండా కేవలం నటనా పరంగా ప్రాధాన్యత కలిగిన పాత్రలనే ఎంచుకుంటోంది. మొత్తం మీద తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి కమిట్ మెంట్ కలిగిన నటీమణి ఉండడం గ్రేట్  కదూ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!