గెలుపు ముంగిట టీమిండియా


మొదటిసారిగా గులాబీ బంతితో ఈడెన్ గార్డెన్లో ప్రారంభమైన రెండో టెస్టు లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో మరో రికార్డుకు చేరువలో ఉంది. సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు ఇంకా నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ ప్రధాన వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆరో వికెట్‌గా తైజుల్‌ ఇస్లామ్‌ ఔటైన తర్వాత ఆటను ముగించారు. ఇంకా బంగ్లాదేశ్‌ 89 పరుగులు వెనుకబడి ఉండటంతో భారత్‌కు మరో ఇన్నింగ్స్‌ విజయం ఖాయంగానే కనబడుతోంది. ఈ జట్టులో ముష్పికర్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

మహ్మదుల్లా, మెహిదీ హసన్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పిన ముష్పికర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. భారత్‌పై మంచి రికార్డు ఉన్న ముష్పికర్‌ అదే ఆటను కొనసాగించాడు. కాకపోతే అతనికి మిగతా వారి నుంచి ఆశించిన సహకారం అందలేదు. ముష్పికర్‌, మహ్మదుల్లాలు క్రీజ్‌లో కుదురుకున్న సమయంలో బంగ్లాకు షాక్‌ తగిలింది. మహ్మదుల్లా తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్ట్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో మెహిదీ హసన్‌ కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించినా ఎక్కవ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్‌, రెండో ఇన్నింగ్స్‌లో అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది.

తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇషాంత్‌ శర్మ నిప్పులు చెరిగే బంతులతో తొలి రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లామ్‌, మోమినుల్‌ హక్‌లను డకౌట్లగా పెవిలియన్‌కు పంపాడు. మహ్మద్‌ మిథున్‌ను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. ఆపై స్వల్ప వ్యవధిలో ఇమ్రుల్‌ కేయిస్‌ ను ఇషాంత్‌ ఔట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ వేసిన ఏడో ఓవర్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చిన ఇమ్రుల్‌ పెవిలియన్‌ చేరాడు. బంగ్లాదేశ్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగు వికెట్లను ఇషాంత్‌ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన ఇషాంత్సం, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో దుమ్ము రేపాడు. అంతకు ముందు భారత జట్టు సారధి కోహ్లీ మరో రికార్డు బ్రేక్ చేశాడు. 

కామెంట్‌లు