లడ్డూలు ప్రియం..భక్తుల ఆగ్రహం

ప్రపంచంలో అత్యంత ధనవంతమైన పుణ్యక్షేత్రంగా వినుతికెక్కింది తిరుమల ఆలయం. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా, కోర్కెలు తీర్చే దైవంగా పేరుంది. ఇక్కడ దొరికే ప్రసాదానికి ఎనలేని డిమాండ్ ఉంటోంది. ఎవరైనా తిరుపతికి వెళితే లడ్డు తీసుకు వచ్చారా అని అడగటం మామూలే. అంటే ఆ ప్రసాదానికి ఎంతటి విలువ వుందో అర్థం చేసుకోవచ్చు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా పాలక మండలి కొలువు తీరాక భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే సామాన్య, మధ్య తరగతి భక్తులు బస చేసే గదుల ధర ఏకంగా వంద శాతం టీటీడీ పెంచింది. తాజాగా 175 గ్రాముల లడ్డూల ధర పెంచేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటి వరకు దివ్య దర్శనం, సర్వ దర్శనం భక్తులకు 70కి నాలుగు లడ్డూలు ఇస్తుండగా ఇకపై రాయితీ తీసేసి ఒక్కో లడ్డూను 50 రూపాయల చొప్పున అమ్మాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం కోసం పంపనుంది. మరో వైపు శ్రీవారి లడ్డూల అమ్మకాన్ని లాభాపేక్షతో చూడటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో నడిచి వచ్చే  దివ్య దర్శన భక్తులకు ఒక ఉచిత లడ్డూను ఇస్తున్నారు. వీరికే సబ్సిడీ ధరతో10 చొప్పున 20కి రెండు లడ్డూలు, 25 ధరతో మరో రెండు లడ్డూలు అంద జేస్తున్నారు. నడిచి వచ్చే భక్తులు 70 ధరతో ఒక ఉచిత లడ్డూతో పాటు మరో నాలుగు లడ్డూలు పొందుతున్నారు.

ఇక టైం స్లాట్​ టోకెన్లతో పొందే  సర్వ దర్శనం, కంపార్ట్​మెంట్లలో వేచి ఉంటూ సర్వ దర్శనం పొందేవారికి కాలిబాట భక్తుల తరహాలోనే 70కి  ఉచిత లడ్డూ మినహా  నాలుగు లడ్డూలు టీటీడీ అంద జేస్తోంది. టీటీడీ ప్రతిపాదించిన కొత్త  విధానంలో అందరికీ ఒక లడ్డూ మాత్రమే ఉచితంగా అందజేస్తారు. అదనంగా మరో 4 లడ్డూలు పొందాలంటే  200 ధర చెల్లించక తప్పదు. కొత్త విధానంలో కాలి నడకన వచ్చే భక్తులు ఐదు లడ్డూలు పొందాలంటే అదనంగా 130 చెల్లించాల్సి వస్తుంది. కాగా 175 గ్రాముల ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి  40 రూపాయలు ఖర్చవుతోంది. ముడి సరుకుల ధరల పెరుగుదలే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు.

సాధారణ రోజుల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 60 వేల నుంచి 1.05 లక్షల వరకు ఉంటోంది. వీరిలో కాలిబాట భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూ, కాలిబాట, సర్వదర్శనం భక్తులకు ఇచ్చే సబ్సిడీ ధరతో కూడిన లడ్డూలతో టీటీడీకి ఏటా 200 కోట్లపైబడి నష్టం వస్తోందంటున్నారు. మూడేళ్ల క్రితమే కల్యాణోత్సవం లడ్డూ ధర 100 నుంచి  200 రూపాయలకు పెంచారు. ఇక వడ 25 నుంచి 100కి పెంచారు. కోరినన్ని లడ్డూలు కావాలనే భక్తులకు  50 చొప్పున విక్రయిస్తున్నారు. అమాంతం పెరిగిన ధరల కారణంగా వీటిని సామాన్య భక్తులు పొందలేని పరిస్థితి నెలకొని ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!