జీల్ కు మరిన్ని కష్టాలు

ఒకప్పుడు ఇండియాలో ఒక వెలుగు వెలిగిన పలు కంపెనీలు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆర్ధిక భారం మోయ లేనంతగా ఉండడం, ప్రపంచ ఆర్థిక మంద గమనం తిరో గమనం వైపు సాగుతుండడంతో పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా అగుపించడం లేదు. తాజాగా ప్రమోటర్‌‌ సుభాష్‌‌ చంద్ర రాజీనామా అనంతరం వార్తల్లోకి వచ్చిన జీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ లిమిటెడ్‌‌ - జీల్‌‌ కు కొత్త సమస్యలు ఎదురు కానున్నాయి. తాజాగా సుబోధ్‌‌ కుమార్‌‌, నిహారికా వోహ్రా ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్లు రాజీనామా చేయడం, ఆరోపణలు లేవ నెత్తడం వల్ల కంపెనీకి సమస్యలు తలెత్తనున్నాయి. కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్పాన్సిబిలిటీ నిధులను సొంత అసోసియేషన్‌‌ కోసం ఖర్చు చేయడం సహా, కంపెనీలో పలు అక్రమాలు జరిగాయని వీరు ఆరోపించారు.

దీంతో సెబీతో పాటు కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగాయి. సీఎస్‌‌ఆర్‌‌ నిధుల అక్రమాలపై ఎంసీఏ విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఆర్‌‌ఎస్‌‌ నిధులను జీ తన సొంత అసోసియేషన్‌‌ కోసం వాడినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని, ఇదే నిజమని తేలితే కంపెనీపై చర్యలు తప్పవని ఎంసీఏ వర్గాలు తెలిపాయి. మాజీ డైరెక్టర్ల ఆరోపణలపై జీ స్పందిస్తూ చట్ట ప్రకారమే సీఎస్‌‌ఆర్‌‌ నిధులు వాడామని, అవసరమైన సర్టిఫికేషన్‌‌ను కూడా పొందామని వివరణ ఇచ్చింది. జీ నుంచి కంటెంట్‌‌ పొందిన డిష్‌‌ టీవీ, సిటీ కేబుల్‌‌ బకాయిలు చెల్లించకున్నా పట్టించు కోలేదని కుమార్‌‌, వోహ్రా లేవనెత్తిన ఆరోపణల సంగతి చూడాలని సెబీ భావిస్తున్నట్టు తెలిసింది.

డెఫినెటివ్‌‌ ప్లాన్‌‌ ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నామని జీల్‌‌ తెలిపింది. ప్రమోటర్‌‌ లోన్ల కోసం బ్యాంకు గ్యారంటీని వాడుకున్నారని ఈ మాజీ డైరెక్టర్లు మరో బాంబు పేల్చారు. దీనిపై సంబంధిత బ్యాంకుకు నోటీసులు ఇచ్చామని జీల్‌‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఫిల్మ్‌‌ అడ్వాన్సుల కోసం 2,200 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలకు బదులిస్తూ ఈ విషయాన్ని వార్షిక రిపోర్టులో వెల్లడించామని, ఇన్వెస్టర్ల సమావేశాల్లోనూ ప్రకటించామని పేర్కొంది. మాజీ ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్ల ఆరోపణలపై ఒక ఎనలిస్టు స్పందిస్తూ వీటిపై కంపెనీ ఇచ్చిన వివరణలు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేవని అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణల వల్ల జీల్‌‌ ప్రతిష్ట బాగా దెబ్బతిందని వ్యాఖ్యానించారు.

వీళ్లు రాసిన ఒరిజినల్‌‌ లెటర్లను కంపెనీ బయట పెడితే బాగుంటుందని అన్నారు. సుభాష్‌‌ చంద్రతోపాటు వోహ్రా, కుమార్‌‌ రాజీనామాలతో జీల్‌‌ షేర్లు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఎస్‌‌ఈ కూడా జీల్‌‌ నుంచి వివరణ కోరడంతో కంపెనీ భవిష్యత్‌‌పై మార్కెట్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ రాజీనామాలకు కారణాలేంటో చెప్పాలని బీఎస్‌‌ఈ అడిగింది. వీళ్లు అందజేసిన రాజీనామా లెటర్లను సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయంపై జీ ఇంకా స్పందించలేదు. ఆరోపణల నేపథ్యం జీల్​ షేర్లు గురువారం 3.11 శాతం పతనమై 309కి చేరాయి.

ఓఎఫ్‌‌ఐ గ్లోబల్‌‌ చైనా ఫండ్‌‌ ఎల్‌‌ఎల్‌‌సీ తమ కంపెనీలో వాటాలను పెంచుకుందని, అదనంగా 1.37 కోట్ల షేర్లను కొందని జీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ ప్రకటించింది. ఓఎఫ్‌‌ఐకి ఇది వరకే జీలో 8.7 శాతం వాటా ఉంది. తాజా షేర్ల కొనుగోళ్లతో ఇది 10.99 శాతానికి పెరిగింది. ఇదిలా ఉంటే జీ ప్రమోటర్‌‌ కంపెనీల్లో ఒకటైన సీక్వేటర్‌‌ మీడియా సర్విసెస్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ 79,912,915 కోట్ల షేర్లను అమ్మేసింది. వీటిలో 13,749,266 షేర్లను ఓఎఫ్‌‌ఐకి అమ్మింది. మొత్తం మీద మాజీ డైరెక్టర్ల ఆరోపణలతో జీ గ్రూప్ కష్టాల్లో పడినట్లయింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!