స్విగ్గీ లో కొలువుల పండుగ
ఫుడ్ డెలివరీ సర్వీసెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి స్విగ్గీ కంపెనీ తాజాగా నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. తమ సర్వీసెస్ ను మరింత మెరుగు పర్చడం తో పాటు కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించడం, ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే కొద్దీ నిమిషాల్లోపే చేర్చేలా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఏకంగా 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది స్విగ్గీ . ఈ మొత్తం ఉద్యోగాలను వచ్చే 18 నెలల కాలంలో వీరిని భర్తీ చేసుకోనుంది. అంతే కాకుండా తమ కంపెనీలో మొత్తం ఐదు లక్షల మంది ఉండాలన్నది కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇండియాలో మూడో అతి పెద్ద సంస్థగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం స్విగ్గీ కి జొమాటో నుంచి అధికంగా పోటీ ఉంటోంది. అంతే కాకుండా తన ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవలందించడంతో పాటు, ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావిస్తోంది.ఇది వాస్తవ రూపం దాలిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రయివేటు రంగ సంస్థగా అవతరిస్తుంది. గిగాబైట్స్ టెక్ కాన్ఫరెన్స్లో స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ వృద్ధి అంచనాలు కొనసాగితే, ఆర్మీ, రైల్వేల తరువాత దేశంలో మూడవ అతి పెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదని వ్యాఖ్యానించారు.
అలాగే రాబోయే 10-15 సంవత్సరాల్లో 100 మిలియన్ల కస్టమర్లు ప్రతి నెలా 15 రెట్లు తమ ప్లాట్ఫాంపై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మెజెటీ చెప్పారు. మొత్తం మీద కంపెనీల మధ్య పోటీ వల్ల నిరుద్యోగులకు మేలు జరుగనుంది. 2018 మార్చి గణాంకాల ప్రకారం ఇండియన్ ఆర్మీ 12.5 లక్షల ఉద్యోగులతో మొదటి స్థానంలో ఉండగా, భారతీయ రైల్వే 12 లక్షలతో రెండవ స్థానంలో ఉంది. ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 4.5 లక్షలతో ప్రయివేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న అతిపెద్ద సంస్థ. 5 లక్షల ఉద్యోగుల లక్ష్యం నెరవేరితే టీసీఎస్ను అధిగమించి అతిపెద్ద ప్రైవేటు రంగ యజమానిగా స్విగ్గీ దూసుకు రానుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి