ఏపీ ప్రభుత్వం..అత్యవసర బాధితుల కోసం
ఏపీలో వైసీపీ సర్కార్ కొలువు తీరాక ప్రజలకు ఉపయోగపడేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో 108 సర్వీసెస్ ను పునరుద్దిరించిన ఘనత తన తండ్రి రాజశేఖర్ రెడ్డిదే. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి తాజాగా వేలాది మంది అత్యవసర బాధితుల కోసం అండగా నిలిచేలా ..జాతీయ రహదారులపై ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు వైఎస్సార్ అత్యవసర చికిత్స పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రమాద బాధితులకు వెంటనే అత్యవసర చికిత్సలు అందించాలని జగన్ ఆదేశించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు సీఎం జగన్.
ఇదిలా ఉండగా ప్రతి ప్రతి 50 కి.మీ.లకు ఒకటి చొప్పున త్వరలో మొత్తం 90 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఇందు కోసం దాదాపు 72 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సంభవించే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈ రహదారులపై త్వరలో ‘డాక్టర్ వైఎస్సార్ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాలు’ పేరుతో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రం మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులపై ఈ హైవే ఎమర్జన్సీ క్లినిక్లకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 4,500 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారుల్లో ప్రతి 50 కి.మీ.కు ఒక హెచ్ఈసీ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.
కాగా, రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మొత్తం 90 క్లినిక్లు ప్రారంభించనున్నారు. ఒక్కో క్లినిక్కు 80 లక్షలు చొప్పున మొత్తం 90 క్లినిక్లకు 72 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిల్లో హెచ్ఈసీలో శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమిస్తారు. ఈ కేంద్రాలను 108 సర్వీసుతో అనుసంధానిస్తారు. చెన్నై–కోల్కత, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులపై అత్యధికంగా ప్రమాదాల రేటు నమోదవుతోంది. వీటిపై గతంలో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కమిటీ ఆదేశించినా గత సర్కారు పెడచెవిన పెట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల లక్షలాది మందికి మేలు చేకూరనుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి