జియో బ్రాడ్బ్యాండ్పై అనాసక్తి
ముకేశ్ అంబానీ జియో పేరుతో టెలికం కంపెనీని 2016లో ప్రారంభించినప్పుడు, ప్రజలంతా దాని సిమ్ కార్డుల కోసం క్యూలు కట్టారు. నెల రోజులపాటు జియో స్టోర్ల ఎదుట ఎప్పుడూ చూసినా రద్దీ కనిపించేది. సిమ్ కార్డ్ దొరికితే పండగే అన్నట్టు ఉండేది పరిస్థితి. మొదటగా జియో సేవలను ఉచితంగా ఇచ్చారు. తదనంతరం చవకగా టారిఫ్లను ప్రకటించింది జియో కంపెనీ. దీంతో విపరీతమైన డిమాండు నెలకొంది. జియో గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రకటించినప్పుడు కూడా ఉత్సాహం కనిపించింది. కొన్ని నెలల పాటు దీని సేవలనూ ఉచితంగా ఇచ్చారు. మూడు నెలల క్రితం టారిఫ్లను ప్రకటించిన తర్వాత మాత్రం జనంలో ఆసక్తి తగ్గింది.
కనీస చార్జీలు 699 రూపాయల నుంచి మొదలు కావడమే ఇందుకు ప్రధాన కారణం. జియో ప్రత్యర్థులు ఎయిర్టెల్, యాక్ట్, హాత్వే వంటి ఆపరేటర్ల చార్జీలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. యాక్ట్ కంపెనీ అయితే నెలకు 450 రూపాయలకు 40 ఎంబీపీఎస్ స్పీడుతో సేవలు అందిస్తున్నది. జియో ఇంటర్నెట్తో పాటు వాయిస్ కాలింగ్ సేవలనూ అందిస్తున్నా టారిఫ్ ఎక్కువ కావడంతో కస్టమర్ల సంఖ్య ఆశించిన స్థాయికి చేర లేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జియో బేస్ టారిఫ్ను 351కి తగ్గించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక నుంచి కూడా 699 నుంచే ప్లాన్లు మొదలవుతాయని, ప్రతి ప్లాన్కు 351 బేస్ ధర అని ఓ అధికారి చెప్పారు.
ఇదే విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లోనూ తెలిపామని అన్నారు. అయితే 699 ప్లాన్కు నెలకు 150 జీబీ చొప్పున హైస్పీడ్ డేటా ఇస్తున్నారు. ఈ మొత్తం అయి పోయాక స్పీడ్ 1 ఎంపీబీఎస్కు తగ్గుతోంది. అలాంటి సమయంలో అదనంగా డేటా పొందడానికి 234 ప్రి పెయిడ్ వోచర్ను కూడా అందుబాటు లోకి తెచ్చింది. ఇది కొంటే వారం రోజుల పాటు అన్ లిమిటెడ్ డేటాను పొందవచ్చు. దేశంలో ప్రస్తుతం బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య రెండు కోట్లు. తన కస్టమర్ల సంఖ్యను త్వరలోనే రెండు కోట్లు పెంచు కోవడానికి జియో ప్రయత్నిస్తోంది. క్రమంగా వీరి సంఖ్య ఐదు కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది.
జియో టారిఫ్లను బట్టి చూస్తే ఈ టార్గెట్ చేరడం కష్టమే. టారిఫ్లను తగ్గించ కుంటే బ్రాడ్బ్యాండ్ సెగ్మెంట్లో వృద్ధి తక్కువ గానే ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి జియో బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల సంఖ్య ఏడు లక్షలు. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 23.5 లక్షలు. ఈ టార్గెట్ను చేరు కోవడానికి కంపెనీకి చాలా ఏళ్లు పట్టాయి. జియో లక్ష్యం నెర వేరాలంటే బ్రాడ్బ్యాండ్ సేవల విస్తరణను పెంచి, టారిఫ్లను పెంచాలని నిపుణులు చెబుతున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి