ఇక సెలవన్న ఎమ్మెస్కే ప్రసాద్‌

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుత ఇండియన్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ మన్నవ శ్రీకాంత ప్రసాద్ పదవీ కాలం ముగిసింది. సంక్షోభంలో ఉన్న భారతీయ క్రికెట్ కు ఓ రకంగా దిశా నిర్దేశం చేసేందుకు ప్రయత్నం చేశారు. తెలుగు వాడైన ఎమ్మెస్కె సక్సెస్ ఫుల్ గా తన పదవీ బాధ్యతలు నిర్వహించారు. 2016లో ఆయన భారత క్రికెట్ ఎంపిక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రసాద్ స్వంత స్థలం గుంటూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడికొండూరు గ్రామం. నాన్న రవిప్రసాద్‌ గుంటూరులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లేబొరేటరీలో పని చేసే వారు. ఆయనకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. వీళ్ళ ఊళ్లో ప్రతీ మూడిళ్లలో ఒక డాక్టరో, ఇంజనీరో ఉండే వారు. అలానే ఇతడి సోదరుడు కూడా ఇంజనీర్‌ కాగా, సోదరి డాక్టర్‌.

ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లోని కేంద్రీయ విద్యాలయలో పూర్తయింది. గ్రాడ్యుయేషన్ హిందూ కళాశాలలో పూర్తి చేశాడు. పాఠశాల దశలోనే క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. ఇంట్లో కూడా ప్రోత్సాహం లభించడంతో గుంటూరుకు వచ్చి పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడు. వికెట్‌ కీపింగ్‌ ఇతడికి సహజ సిద్ధంగానే అబ్బింది. గుంటూరులో జరిగిన కోచింగ్‌ క్యాంపునకు తొలిరోజు వెళ్లినప్పుడు సెలెక్షన్సుకు 200 మంది హాజరయ్యారు. అందులో వికెట్‌కీపర్‌ ప్రసాద్ మాత్రం ఒక్కడే.  ఆ రోజున కోచ్ ఇతడికి కష్టమైన క్యాచ్ లు ఇస్తుండగా వాటన్నింటినీ ఆరి తేరిన వాడిలా ఒడిసి పట్టుకొన్నాడు. ఆరోజు నుంచి కోచ్ పూర్ణచంద్రరావు వికెట్‌ కీపింగ్‌లో సాన పెట్టారు. దీంతో మూడు నెలల్లోనే ఆంధ్ర రంజీ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఇంటర్‌ జోనల్‌ మ్యాచ్ లు ఆడే రోజుల్లో గౌరవ కార్యదర్శి వెంకటరామ్‌ ఇతడి ఆట తీరు చూసి ఈ కుర్రాడు ఏరోజు కైనా భారత క్రికెట్‌ జట్టులో చోటు సంపాదిస్తాడన్నారు.

కోచ్ తోపాటు స్నేహితులు, కుటుంబ సభ్యులంతా ప్రోత్సాహం అందించడంతో క్రికెట్‌లో ఉన్నత శిఖరాలకు చేరు కోవడానికి బాగా కష్టపడ్డాడు. ప్రసాద్ తో పాటు అజిత్ అగార్కర్‌ పాకిస్థాన్ ఏ టూర్‌ నుంచి దేశానికి వచ్చారు. ఆ వెంటనే ముక్కోణపు సిరీస్‌కు అగార్కర్‌ ఎంపిక కాగా, మోంగియా గాయ పడటంతో ఎమ్మెస్కె భారత జట్టులో ఆడే అవకాశం లభించింది. కోకాకోలా ముక్కోణపు సిరీస్‌లో మొహాలీ క్రికెట్‌ గ్రౌండ్‌లో బంగ్లాదేశపై వన్డే మ్యాచతో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం ప్రారంభమైంది. అది ఇతడి జీవితంలో మరిచిపోలేని రోజు. అంతకు ముందు ఇండియా-ఏ తరపున ఐదు విదేశీ టూర్లలో పాల్గొన్నప్పటికీ తొలి వన్డే మ్యాచ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఆ మ్యాచలో ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు.

తదుపరి టెస్టు కెరీర్‌ ప్రస్థానం న్యూజిల్యాండ్‌తో ప్రారంభమైంది. ఆ మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 83  పరుగులకే కుప్ప కూలింది. ఆ రోజున ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మెనగా క్రీజులోకి వెళ్లాడు. అప్పటికే 43  పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మైదానం లో సచిన్ టెండుల్కర్‌ క్రీజ్‌లో ఉన్నాడు. ఆయన మ్యాచ్ లో పరిస్థితి ఎలా చూస్తున్నావని ప్రశ్నించాడు. ఇతడు ఒక్కటే సమాధానం చెప్పాడు. రోజంతా వికెట్ల ఎదుట పాతుకు పోయేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఆ జవాబు ప్రసాద్ నుంచి వచ్చినందుకు సచిన్ సంతోష పడ్డాడు. అయితే కొద్దిసేపటికే సచిన్ అవుట్‌ కాగా ఆ తర్వాత శ్రీనాథ్‌, టెయిల్‌ ఎండర్లు క్యూకట్టారు. దాంతో 16 పరుగులతో నాటౌట్‌గా మిగిలి పోయాడు. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లేటప్పుడు కౌలాలంపూర్‌లో సామాను తీసుకుని వెళుతుండగా అది ఇతడి మోకాలుకు కొట్టుకొన్నది. దానిని ఇతడు తేలికగా తీసుకున్నాడు.

తీరా ఆస్ట్రేలియా వెళ్లాక చూస్తే నడవలేని పరిస్థితి. బాగా వాపు రావడంతో జట్టు ఫిజియో థెరపిస్ట్ ఇతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దీంతో మోంగియాను అప్పటికప్పుడు పిలిపించారు. ఆ తర్వాత వన్డే జట్టులో ఇతడు ఉంటానని ఆశించాడు. అయితే ఇతడిని జట్టు నుంచి తొలగించి నట్లుగా కెప్టెన్ చెప్పడంతో షాక్‌కు గురయ్యాడు. టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఐదేళ్ల పాటు ఆంధ్రా రంజీ జట్టులో ఆడాడు. మళ్లీ జట్టులో స్థానం పొందుతానని ఆశించాడు. ఎమ్మెస్కె తో పాటు మరో ఇద్దరికి కూడా చోటు లభిస్తుందనుకున్నారు. ఆ అవకాశం రాక పోవడంతో 33 ఏళ్ల వయస్సులోనే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాశాడు. ఆ వెంటనే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్ లో కీలక పదవులు చేపట్టాడు. జాగర్లమూడి నరేంద్రనాథ్‌ సహకారంతో జేకేసీ కళాశాలలో ఆంధ్రా ఉమెన్సు క్రికెట్‌ అసోసియేషన్ స్థాపించాడు. ఇక్కడే కోచింగ్‌ క్యాంపు ప్రారంభింప చేశారు. ఇతడి ఆలోచనలకు రూపు ఇచ్చారు.

బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ జేకేసీ కళాశాల గ్రౌండ్స్‌ని సందర్శించి ఇదొక రోల్‌ మోడల్‌ అని కితాబిచ్చారంటే దాని వెనక ఎమ్మెస్కే కఠోర శ్రమ ఎంత వుందో అంచనా వేయొచ్చు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజుతో ఇతడికి సాన్నిహిత్యం పెరిగింది. ఎంతో మంది వర్ధమాన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చాడు. సెలెక్షన కమిటీ చైర్మన్ పదవికి ముందే సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఏదో ఒక రోజు సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు. అయితే ఇతడి కంటే సీనియర్‌ క్రికెటర్లు ఉన్నప్పటికీ 2016 సెప్టెంబరులో ఇతడిని బీసీసీఐ సెలెక్షన కమిటీ చైర్మన్ గా నియమించింది. తాజాగా ఎమ్మెస్కె తన పదవీ కాలం పూర్తయ్యింది. నిబద్దత కలిగిన ప్రసాద్ లేక పోవడం తెలుగువారికి బాధాకరం. 

కామెంట్‌లు