భారీగా కొల్లగొట్టిన కేటుగాడు
ఈ దేశంలో సామాన్యులకు అప్పులు దొరకవు. కానీ రుణాలు కావాలని ఎగ్గొట్టే వాళ్లకు మాత్రం దండిగా ప్రభుత్వ బ్యాంకులు ఇస్తూ పోతున్నాయి. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో పీకల లోతుకు కూరుకు పోయిన నీరవ్ మోడీ అనుకున్న దాని కంటే అధికంగా డబ్బులు కొల్లగొట్టాడు. రెండేళ్ల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ బయటికి వచ్చినప్పుడు దేశమంతా నివ్వెర పోయింది. బ్యాంకు సొమ్ము 13,500 కోట్లను నీరవ్ మోడీ, ఇతడి బంధువు మెహుల్ చోక్సీ కొల్ల గొట్టారని తెలియడంతో బ్యాంకింగ్ రంగం మొత్తం షాకింగ్కు గురైంది. డొల్ల కంపెనీల ద్వారా మోడీ, అతని మనుషులు బ్యాంకు సొమ్మును దోచేస్తున్నప్పటికీ ఎవరూ కనిపెట్టలేక పోయారు.
అయితే ఈ కథ ఇక్కడితో ముగియ లేదు. తవ్విన కొద్దీ మరిన్ని సంచలన విషయాలు బయట పడుతున్నాయి. ఈ ఘటన జరిగాక పీఎన్బీ యాజమాన్యం ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించగా, ఈ కమిటీ పలు సంచలన విషయాలను వెల్లడి చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 28 వేల కోట్ల విలువైన 1,561 లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ ను పీఎన్బీ నీరవ్ మోడీ గ్రూప్కు ఇచ్చినట్టు బెల్జియన్ ఆడిటింగ్ కంపెనీ బీడీఓ బయట పెట్టింది. వీటిలో 25 వేల కోట్ల విలువైన 1,381 ఎల్ఓయూలను మోసపూరితంగా ఇచ్చారని స్పష్టం చేసింది. 23 మంది ఎగుమతిదారులకు ఎల్ఓయూలను ఇవ్వగా, వీరిలో 21 మందిని మోడీ ‘కంట్రోల్’ చేశాడని తేలింది. 193 ఎల్ఓయూల ద్వారా అందిన ఆరు వేల కోట్లను బ్యాంకుకు చెల్లించడానికి దుర్వినియోగం చేశారని బీడీఓ వేలెత్తి చూపింది.
పీఎన్బీ కుంభకోణం గురించి ఈ సంస్థ ఇది వరకే ఐదు మధ్యంతర నివేదికలు ఇచ్చింది. తాజాగా అంద జేసింది చివరి నివేదిక. 329 పేజీలు ఉన్న ఈ ఫోరెన్సిక్ రిపోర్టు కాపీని ఒక విజిల్ బ్లోయర్ ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ కు అందజేశాడు. ఇందులో భాగమైన ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వివరాలను బయట పెట్టింది. బీడీఓ డ్రాఫ్ట్ రిపోర్ట్ను పీఎన్బీ ఇది వరకే సీబీఐ, ఈడీ సహా పలు సంస్థలకు అంద జేసింది. విచారణలో భాగంగా బీడీఓ టీమ్ నీరవ్ మోడీ, అతడి కుటుంబ సభ్యుల ఆస్తులను వివరాలను పరిశీలించారు. ఇండియాలో వీరికి 20 వరకు ఆస్తులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానినీ బ్యాంకు లోన్లు పొందడానికి తనఖాగా పెట్టలేదు.
ఒక్క నీరవ్ మోడీ పేరిట మనదేశంలో ఉన్న 15 ఆస్తుల విలువ1,300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. వీటిని ఆఫీసర్లు జప్తు చేశారు. విదేశాల్లో 13 స్థిరాస్తులూ ఉన్నట్టు గుర్తించారు. అంతేగాక ఐదు లగ్జరీ కార్లు, బోటును చరాస్తులుగా గుర్తించారు. మోడీ 20 కోట్ల విలువైన 106 పెయింటింగులనూ కొన్నాడు. వీటిని ఎంఎఫ్ హుస్సేన్, జామినీ రాయ్, జోగెన్ చౌదరి, రాజా రవివర్మ వంటి ఫేమస్ ఆర్టిస్టులు గీశారు. పీఎన్బీ స్కామ్ బయట పడ్డాక చోక్సీ, మోడీ పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా బార్బుడాలో, నీరవ్ మోడీ బ్రిటన్లో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చిలో నీరవ్ లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. తదనంతరం అక్కడి పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. ఇండియాకు అప్పగించే విషయమై ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
తదుపరి విచారణ వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడింది. నీరవ్ మోడీ సమీప బంధువు చోక్సీని అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ప్రకటించింది. ఇతడు తమను 44.1 కోట్లకు మోసం చేశాడని మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా ఇటీవల వెల్లడించింది. ఇతడిని ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది. బాకీ వసూలుకు చట్ట పరమైన చర్యలు మొదలు పెట్టినట్టు ప్రకటించింది. దీంతో కలుపుకుంటే చోక్సీ మూడు ప్రభుత్వ బ్యాంకులకు టోపి పెట్టాడు. మొత్తం మీద దొంగలు, ఎగవేతదారుల మోడీ సర్కార్ లో విదేశాలకు హాయిగా వెళ్లి పోతున్నారు. అప్పులు మాత్రం ప్రజలకు మిగులుతున్నాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి