ఐపీఎల్ వేలానికి వేళాయెరా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ యుద్దానికి సిద్ధమవుతోంది. వర్ధమాన ఆటగాళ్లకు ఇప్పుడు ఇదో గొప్ప వేదికగా ఉపయోగ పడుతోంది. అండర్ -19 జట్టులో మెరికల్లాంటి కుర్రాళ్ళు దుమ్ము రేపుతున్నారు. ఐపీఎల్ లో తమ ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. మరో వైపు ఇండియన్ క్రికెట్ అకాడెమీకి మెంటార్ గా ఉన్న, మాజీ సారధి రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లకు నగిషీలు చెక్కుతున్నాడు. ఏ ఫార్మాట్ లోనైనా సరే ఆడేలా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా తీర్చి దిద్దుతున్నాడు. ఆయన ట్రైనింగ్ లో రాటుదేలిన కుర్రాళ్ళు ఇప్పుడు టీమిండియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి వారిలో చాలా మంది ఇప్పుడు రఫ్ఫాడిస్తున్నారు. మరో వైపు బిసిసిఐకి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రెసిడెంట్ గా కొలువు తీరడంతో పూర్తిగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.
ఇండియాలో క్రికెట్ కు కొత్త జవసత్వాలు తీసుకు వచ్చే పనిలో పడ్డాడు. ఐపీఎల్ లో కూడా మార్పులు చేయాలని అనుకుంటున్నాడు ఈ దాదా. తాజాగా ఐపీఎల్ పండగ సీజన్ వచ్చేసింది. 2020 సీజన్ ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన మొత్తం 971 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటుండగా, వారిలో నుంచి 73 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 2 కోట్ల కనీస ధరతో ఏడుగురు క్రికెటర్లు పలుకు తుండగా, 1.5 కోట్ల కనీస ధరతో మరో 9 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నారు. ఇదిలా ఉండగా 2 కోట్ల ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజల్వుడ్ ముందు వరుసలో ఉన్నారు.
ఆ దేశానికి చెందిన బ్యాట్స్మెన్లు గ్లెన్ మాక్స్వెల్, క్రిస్లిన్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఉన్నారు. వీరితో పాటు శ్రీలంక నుంచి ఏంజెలో మాథ్యూస్, దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ ఉన్నారు. వీరిని కొనాలని భావించే ఫ్రాంచైజీ 2 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వుంటుంది. ఇక కోటిన్నర కోట్ల విలువైన క్లబ్ రేస్ లో ఇండియన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ముందంజలో ఉండగా ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్, కేన్ రిచర్డ్సన్, ఇగ్లాండ్కు చెందిన డేవిడ్ విల్లీ, క్రిస్వోక్స్, జేసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్ తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్, కెల్లీ అబ్బాట్ ఉన్నారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి