మిస్టర్ కూల్ సరి కొత్త అవతారం
మాజీ టీమిండియా సారధి, ప్రస్తుత జట్టు ప్లేయర్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీకి సరి కొత్త పోస్టు ఇవ్వాలని అనుకుంటోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. టీమిండియా తొలి డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమైన తరుణంలో అందుకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగనున్న టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో డే అండ్ నైట్ టెస్టు ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించి వారి అనుభవాలను పంచుకోనుంది.
ఇందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యాలు సంయుక్తంగా భారత మాజీ కెప్టెన్ల ను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు 2001లో ఆసీస్పై కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లతో పాటు ఆ గెలుపులో భాగస్వామ్యం అయిన వారికి కూడా ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ పంపనున్నారు. ఇక ధోని కామెంటేటర్ అవతారం ఎత్తే అవకాశం కనబడుతోంది. ధోని తో కామెంటరీ చెప్పించే ఏర్పాట్లను బీసీసీఐ పరిశీలిస్తోంది.
దీనికి స్టార్ స్పోర్ట్స్ అంగీకారం తెలిపితే ధోనిని కామెంటరీ బాక్స్లో చూసే అవకాశం వీక్షకులకు దక్కనుంది. 2019 వరల్డ్ కప్లో భాగంగా న్యూజిలాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైన తర్వాత ధోని ఏ మ్యాచ్ లోనూ ఆడలేదు. అప్పట్నుంచి తన వ్యక్తిగత పనులతో పాటు కుటుంబంతోనే ఎక్కువగా గడుపు తున్నాడు. ధోనిని ఫీల్డ్లో చూసే అవకాశాన్ని అభిమానులు మిస్ అవుతున్నారు. ఒకవేళ ధోని వ్యాఖ్యాతగా వస్తే మరొకసారి ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. ఇక ఆడియో కామెంటరీ ఏర్పాట్లకు కూడా స్టార్ యాజమాన్యం సిద్ధమవుతోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి