డెడ్ లైన్ బేఖాతర్..సమ్మెనే బెటర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు విధించిన డెడ్ లైన్ ను ఆర్టీసీ కార్మికులు పట్టించు కోలేదు. 49 వేల మంది కార్మికుల్లో కేవలం ప్రభుత్వ పిలుపునకు 300 మంది మాత్రమే విధుల్లో చేరారు. మరికొందరు తిరిగి పోరాట బాట పట్టారు. తిరిగి డ్యూటీలో చేరే విషయంలో కార్మికులు వెనకడుగు వేయడం లేదు. మిగిలిన వారంతా సమ్మెలోనే కొనసాగాలని డిసైడ్ అయ్యారు. డిపోల్లోనే కాకుండా పోలీసు స్టేషన్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్టీఓ, ఎస్పీ డీఎస్పీ తదితర కార్యాలయాల్లో కూడా తిరిగి చేరికకు సంబంధించిన లేఖలు ఇవ్వచ్చని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల కార్మికులు ఆయా కార్యాలయాల్లో అంద జేశారు.
విధుల్లో చేరిన కార్మికులనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతా వారికి సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తేల్చి చెప్పారు. దీంతో కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే జీతాలు లేనందున రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది కార్మికులు విధుల్లో చేరే విషయంలో కుటుంబ సభ్యులు, సన్ని హితులతో చర్చించారు. ఎక్కువ మంది చేరేందుకే ఆసక్తి కనబరిచారు. విషయం తెలిసిన కార్మిక సంఘాల నేతలు వెంటనే రంగం లోకి దిగి తిరిగి సమ్మెలో పాల్గొనేలా చేశారు.
కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇన్ని వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదని, ఇన్ని రోజులు పోరాటం చేసి ఇప్పుడు చేతులెత్తేస్తే సంస్థను కాపాడు కోలేమని చెప్పారు. ఇదంతా కార్మికులందరికీ చేరేలా సక్సెస్ అయ్యారు నేతలు. దీంతో కార్మికుల్లో చాలా మంది విధుల్లో చేర కుండా ఆగి పోయారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున, దాన్ని మూసి వేయాలంటే కచ్చితంగా కేంద్రం పర్మిషన్ తీసుకోవాలన్నారు.
ఈ విషయాలను కార్మికులకు తెలిపారు. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించడం సాధ్యం కాదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కోర్టులో సాగుతున్న న్యాయ పోరాటాన్ని బలహీన పరిచేందుకు సీఎం ఎత్తుగడగా అభివర్ణించారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా జేఏసీతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి