పగలు రాత్రి టెస్టుకు రెడీ
బిసిసిఐ ప్రెసిడెంట్ గా బెంగాలీ దాదా, మాజీ సారధి సౌరబ్ గంగూలీ కొలువు తీరాక పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల పాలక మండలి పూర్తిగా బాధ్యతలు చేపట్టింది. వెంటనే సెలెక్షన్ కమిటీ కూడా బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టీ - 20 తో పాటు టెస్ట్ టీమ్స్ ను ప్రకటించింది. డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణపై చాలా కాలంగా తన ఆసక్తిని ప్రదర్శించిన సౌరవ్ గంగూలీ ఇప్పుడు బోర్డు అధ్యక్ష హోదాలో దానికి కార్య రూపం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. పగ్గాలు చేపట్టిన తర్వాత పలు మార్లు గులాబీ బంతితో టెస్టు నిర్వహణ గురించి సౌరవ్ కామెంట్స్ చేశాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్తో కోల్కతాలో భారత్ ఆడే రెండో టెస్టును డే అండ్ నైట్గా నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. తన సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుందని నిర్దారించారు దాదా. మీ అభిప్రాయం చెప్పాలంటూ బంగ్లాదేశ్ బోర్డును కోరాడు. నవంబర్ 22 నుంచి 26 వరకు ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్తో మాట్లాడాను. వాళ్లు దాదాపుగా అంగీకరించారు. అయితే తమ ఆటగాళ్లతో మాట్లాడాల్సి ఉందని నాతో చెప్పారు. ఇది కచ్చితంగా డే అండ్ నైట్ మ్యాచ్ అవుతుందని నేను నమ్ముతున్నా. వారు వీలైనంత తొందరగా తమ అధికారిక ప్రకటన చేస్తారు. ఒక్కసారి బంగ్లా బోర్డు నుంచి సమాధానం వస్తే మేం టెస్టు నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలు పెడతాం అని గంగూలీ చెప్పాడు.
భారత్ లాగే బంగ్లాదేశ్ కూడా ఇప్పటి వరకు ఒక్క డే అండ్ నైట్ టెస్టు కూడా ఆడలేదు. కోల్కతా టెస్టు సందర్భంగా షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ మేరీ కోమ్, షట్లర్ పీవీ సింధు, తదితర ఒలింపియన్లను ఘనంగా సన్మానించనున్నట్లు సౌరవ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్న జేన్ మెక్గ్రాత్ ఫౌండేషన్ కోసం ప్రతీ ఏటా ‘పింక్ టెస్టు’ను నిర్వహిస్తారు. అదే తరహాలో ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్ కూడా ప్రతీ సంవత్సరం, సాగే వేడుక కావాలని తాను కోరుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ తన మనసులో మాట చెప్పాడు. తొలిసారి ఫస్ట్క్లాస్ క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశ పెట్టనున్నట్లు గంగూలీ ప్రకటించాడు. బోర్డు కొత్త ఫైనాన్స్ కమిటీ దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పాడు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి