జోరుకు విండీస్ బ్రేక్

గెలుపు ఊపులో ఉన్న టీమిండియాకు విండీస్ బ్రేక్ వేసింది. అటు బ్యాటింగ్ లోను..ఇటు బౌలింగ్ లోను మన ఆటగాళ్లు చతికిల పడ్డారు. మొత్తానికి భారత్‌ ఆట గాడి తప్పింది. వేగం పెంచాల్సిన చోట వికెట్లను  కోల్పోవడం..ఆ తర్వాత ఏమాత్రం జోరందు కోలేక పోవడం టీమిండియా భారీ స్కోరుకు కళ్లెం వేసింది. విండీస్‌ ముందుగా బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. అనంతరం బ్యాటింగ్‌ మెరుపులతో సులువుగా నెగ్గింది. కీలక దశలో భారత ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా వారికి కలిసొచ్చింది. మొత్తం మీద ప్రత్యర్థి దెబ్బకు భారత్‌ తల వంచింది. బ్యాటింగ్‌లో ఎదురు దాడి, బౌలింగ్‌లో వాడి లేక రెండో టి20లో టీమిండియా ఓడింది.

రెండో టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో విరాట్‌ కోహ్లి బృందాన్ని ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–1తో నిలిచింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్‌ దూబే దుమ్ము రేపాడు. 30 బంతుల్లో 54 పరుగులు చేశాడు. పంత్‌ 22 బంతుల్లో 33 పరుగులు చేయడం తో ఆ మాత్రం స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. సిమన్స్‌ 45 బంతుల్లో 67 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.

అతడికి తోడుగా లూయిస్‌ నిలబడ్డాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కోహ్లి స్థానంలో ప్రమోషన్‌లో వచ్చిన శివమ్‌ దూబే ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా...తర్వాత విండీస్‌ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. పొలార్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో అయితే ఒక్కసారిగా చెలరేగాడు.11వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి హెట్‌మైర్‌ చేతికి చిక్కాడు. మొత్తం మీద మూడో మ్యాచ్ మరింత రంజుగా జరగనుంది. సిరీస్ ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. ఈజీగా నెగ్గుతుందనుకున్న టీమిండియా ఇలా ఒడి పోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ నీరుగారి పోయారు.

కామెంట్‌లు