జార్ఖండ్ డైనమెట్..క్రికెట్ లెజెండ్

మిస్టర్ కూల్ గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లోకి ఎంటరై 15 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ అద్భుతమైన ఆటగాడు ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఇష్టపడడు. కేవలం ఆట మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఇతడి నైజం. ఇంటర్ నేషనల్ క్రికెట్ లో ఎమ్మెస్ ధోని అంటే ఓ క్రేజ్. ఇండియాలో అతడంటే కోట్లాది అభిమానులు చెవి కోసుకుంటారు. అంతలా పాపులర్ అయ్యాడు ఈ ఝార్ఖండ్ డైనమెట్. గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ కుటుంబంతో గడుపుతున్నాడు. 2004, డిసెంబర్‌ 23 న బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌ ధోనికి ఒక చేదు జ్ఞాపకాల్ని మిగల్చగా ఆ తర్వాత కాలంలో అతని కెరీర్‌ ఒక గొప్ప దశను చూసింది. 

భారత క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌గా ధోని ఘనత సాధించాడు. అతని సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు టీ20 వరల్డ్‌ కప్‌తో పాటు వన్డే వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకుంది. చాంపియన్స్‌ ట్రోఫీని సాధించి పెట్టిన ఘనత కూడా ధోనిదే.  ఐసీసీ నిర్వహించే అన్ని మేజర్‌ టోర్నీలను సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోని ఖ్యాతి గడించాడు. ఇక భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌ మార్క్‌ ధోని సొంతం. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌తో ధోని అరంగేట్రం చేసిన వన్డే మ్యాచ్‌ ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ మ్యాచ్‌లో ధోని గోల్డెన్‌ డక్‌గా పెవిలిన్‌ చేరాడు. ఆ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ధోని 19 పరుగులే చేసి నిరాశ పరచడంతో తన కెరీర్‌పై డైలామాలో పడ్డాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలనా.. అనే ప్రశ్న తలెత్తిన సిరీస్‌ అది. కాగా, 2005లో ధోని కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

విశాఖపట్టణంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తనలోని సత్తాను ప్రపంచానికి చూపెట్టిన క్షణమది. పాకిస్తాన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను చీల్చి చెండాడుతూ 123 బంతుల్లో 148 పరుగులు సాధించాడు ధోని. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ధోని వెనుదిరిగి చూసింది లేదు. భారత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ధోని.. 2007లో టీ20  వరల్డ్‌ కప్‌ను, 2011 వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి పెట్టాడు. 2013లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనీ అంటే అభిమానులకే కాదు ఇతర దేశాల ఆటగాళ్లకు కూడా ఇష్టమే. అంతలా అల్లుకు పోయాడు ఈ క్రికెటర్. 

కామెంట్‌లు