అమ్మకానికి ఆస్తులు రెడీ

మోదీ కొట్టిన దెబ్బకు భారతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. విత్త మంత్రి ఎన్ని ఉద్దీపన చర్యలు చేపట్టినా ఫలితం అగుపించడం లేదు. ట్రాయ్ పరిధిలోకి వచ్చే టెలికాం కంపెనీలన్నీ తమ అప్పుల నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచిస్తున్నాయి. అంతే కాకుండా తమ ఆస్తుల విక్రయించేందుకు రెడీ అంటున్నాయి. ఇప్పటికే సుప్రీం కోర్టు ఇచ్చిన షాక్ తో దిగ్గజ ప్రయివేట్ టెలికాం కంపెనీలన్నీ లబోదిబోమంటున్నాయి. గడువు కేవలం మూడు నెలలు మాత్రమే ఇవ్వడంతో అన్ని కంపెనీలు కొనుగోలుదారుల కోసం క్యూ కడుతున్నాయి. తాజాగా భారీ రుణ భారంతో కుదేలైన వొడాఫోన్‌ ఐడియా కంపెనీ ఆస్తుల విక్రయానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తోనూ, నవీ ముంబైలో ఉన్న డేటా సెంటర్‌ను అమ్మేయడానికి ఎడెల్‌వీజ్‌ గ్రూప్‌తోనూ ఐడియా చర్చలు జరుపుతోందని సమాచారం. వొడాఫోన్‌ ఐడియా కంపెనీ తన 1,56,000 కిమీ ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ ఫీల్డ్‌ సంస్థతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ వ్యాపారం విలువ దాదాపు 200 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా.
ఇక నవీ ముంబైలోని డేటా సెంటర్‌ను ఎడెల్‌వీజ్‌ సంస్థకు చెందిన ఎడెల్‌వీజ్‌ ఈల్డ్‌ ప్లస్‌ ఫండ్‌ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డేటా సెంటర్‌ విలువ 10 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చు.

సవరించిన స్థూల రాబడి కి సంబంధించి వొడాఫోన్‌ ఐడియా 53,000 కోట్ల బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్ట్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 24న తీర్పు చెప్పింది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా ఈ బకాయిలను కొంతైనా తీర్చాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అయితే టెలికం రంగానికి 7 లక్షల కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో ఆప్టిక్‌ ఫైబర్‌ ఆస్తుల విక్రయానికి బ్యాంక్‌లు అభ్యతరం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ ఆస్తులను తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణాలు పొందాయి. దీంతో ఇటు బ్యాంకులు సైతం అప్పులు చెల్లించాలని వత్తిడి తెస్తున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!