అబ్బా..మిర్చి దెబ్బ
మిర్చి ధర ఘాటెక్కిస్తోంది. నిత్యం కూరల్లో కారం లేకుండా వంట చేయడం అసాధ్యం. దీంతో మన మిర్చికి ఎక్కడా లేనంతటి డిమాండు ఉంటోంది. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న తేజ రకం మిర్చి క్వింటాలుకు 20 వేల రూపాయల రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఇతర రకాలకు సైతం 16 వేలకు తగ్గకుండా ధరలు వస్తున్నాయి. గిడ్డంగుల్లో నిల్వలు తక్కువగా ఉండటం, ఇతర దేశాలకు ఎగుమతుల ఆర్డర్లు ఉండటంతో మార్కెట్లో మిర్చి ధరలు ఉహించని విధంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల ఏఎంసీల పరిధిలో 15కు పైగా శీతల గిడ్డంగులు ఉండగా, కేవలం లక్షన్నర టిక్కీల మిర్చి మాత్రమే నిల్వ ఉంది.
రాష్ట్రంలో మొత్తం శీతల గిడ్డంగుల్లో 10 లక్షల టన్నుల మిర్చి నిల్వ ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఊహించని విధంగా ధరలు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతి కొచ్చిన సమయంలో గరిష్ఠంగా తేజ రకానికి 8 వేలు, లావు రకాలకు 7 వేలు, 4884 రకానికి 6 వేల వంతున ధర లభించటమే గగనమైంది. నాలుగు నెలల క్రితం నుంచే మార్కెట్లో మిర్చి ధరల్లో మార్పు మొదలైంది. అప్పట్లో తేజ రకానికి 12- 14 వేల వరకు, లావు రకాలకు 9,500 - 10 వేల వరకు, 4884 రకానికి పది వేలకు తగ్గకుండా వచ్చింది.
రెండు రోజుల నుంచి ఈ రేట్లు మరింత పెరిగి పోయాయి. తేజ రకానికి రికార్డు స్థాయిలో గుంటూరు యార్డులో 19,500 లభించగా, ఖమ్మం మార్కెట్లో 20 వేలు పలికింది. మిర్చి ఎగుమతులు సైతం ఆశాజనకంగా ఉన్నాయని, చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు భారీగా వచ్చాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలు, ఎగుమతులకు చాలినన్ని నిల్వలు అందుబాటులో లేవు. కొత్త కాయ రావటానికి ఇంకా నెల రోజులకు పైగా పడుతుంది. ఈ నేపథ్యంలో మిర్చికి గిరాకీ బాగా పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి