మందిరానికి మార్గం..మసీదుకు స్థలం
సుదీర్ఘమైన ఉత్కంఠకు తెరపడింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పు వెలువరించడంతో మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగి పోయాయి. దీంతోమార్గం సుగమమైంది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయోధ్య యాక్ట్ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద స్ధలాన్ని రామజన్మ న్యాస్కే అప్పగించింది. వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ తీర్పును చదివి వినిపించారు.
ఐదుగురు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. వివాదాస్పద స్ధలం తమదే నంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను సైతం తోసి పుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్ చేసే హక్కు లేదని తేల్చి చెప్పింది. చరిత్ర, మత పరమైన, న్యాయ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పేర్కొన్నారు.
మసీదు కింద భారీ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదిక వెల్లడించిందని చెబుతూ బాబ్రీ మసీదును కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ఆధారాలు లేవని అన్నారు.12 నుంచి 16వ శతాబ్ధాల మధ్య ఏం జరిగిందనడానికి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే మసీదును ముస్లింలు ఎప్పుడు వదలి వేయలేదని అన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం చట్ట విరుద్ధమని తెలిపింది. అయోధ్యను హిందువులు రామ జన్మభూమిగా భావిస్తారు. వారి విశ్వాసాలను తప్పు పట్టలేమని తీర్పును చదవుతూ ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
అయితే అక్కడ దేవాలయం ఉందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులు నిర్ధారించలేమని అన్నారు. మత పరమైన విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోదు. న్యాయ సూత్రాల ఆధారంగానే భూమి యాజమాన్య హక్కులు నిర్ణయించాలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. వివాదాస్పద భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదేని పేర్కొన్నారు. పురావస్తు నివేదికలనూ మదింపు చేసి తీర్పును వెల్లడించామన్నారు. జస్టిస్ గగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి