ట్రంప్ గరం..డ్రాగన్ ఆగ్రహం
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసించాలని ఉవ్విళూరుతున్న అమెరికా అవకాశం చిక్కితే చాలు మాటలతో దాడులు చేస్తోంది. అదే పనిగా నోరు పారేసు కోవడంలో ఆ దేశ అధినేత ట్రంప్ కు అలవాటే. ఆయన అమెరికా జపం చేస్తున్నారు. తాజాగా డ్రాగన్ చైనాపై వాణిజ్య యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తి వేసే దిశగా తమ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదర లేదని కుండబద్దలు కొట్టారు.
సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనా కోరినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వారు నాతో ఎలాంటి చర్చలు జరప లేదు. ఎందుకంటే నేను దానికి ఒప్పుకోనని వారికి తెలుసు. అందుకే సుంకాల ఎత్తి వేతను తాను ఖండిస్తున్నా అంటూ ట్రంప్ చెప్పారు. అయినా ఇది ఎప్పటికి జరగని పని అని తేల్చి పారేశారు. ప్రస్తుతం చైనా ఆర్ధికంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోందని, అందుకే ఇటువంటి ఒప్పందాల కొరకు పాకులాడు తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వారం ఇరు దేశాల మధ్య సుంకాలను దశల వారిగా ఎత్తి వేయాలని నిర్ణయించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దానికి తెర పడినట్లేనని అంతా భావించారు. కానీ, తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో మళ్లీ ఆందోళన మొదలైంది. గతవారం చైనా చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలని పలువురు ఆర్థిక నిపుణులు అనుకుంటున్నారు. మొత్తం మీద దిగ్గజ దేశాల మధ్య ఆధిపత్య పోరు ఇంఎర్నేషనల్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపనుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి