మహా సంక్షోభం..అధికారం సగం సగం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను రూపొందించినట్లు సమాచారం. శివసేన, ఎన్సీపీలకు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవితో పాటు చెరో 14 మంత్రి పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్కు అయిదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు 11 మంత్రి పదవులు ఇవ్వాలనే విధంగా ఒప్పందం కుదరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై తొలుత ఎన్సీపీ, కాంగ్రెస్లు చర్చలు జరిపి, ఆ తరువాత శివసేనతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పేర్కొన్నాయి. ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు థోరాత్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, మాణిక్ రావు సమావేశమయ్యారు.
చర్చలు సరైన దిశలో కొనసాగు తున్నాయని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పార్టీల నుంచి మద్దతు లేఖను సాధించేందుకు తాము అడిగిన మూడ్రోజుల గడువును గవర్నర్ కోష్యారీ తిరస్కరించారనే విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో శివసేన ప్రస్తావించలేదు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఇప్పటికే అమల్లోకి వచ్చినందున, మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా..మూడ్రోజుల సమయం ఇచ్చేందుకు గవర్నర్ ఒప్పుకోని అంశాన్ని పిటిషన్లో ప్రస్తావించ లేదని శివసేన లాయర్లు తెలిపారు.
గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ, వెంటనే దీనిపై అత్యవసర విచారణకు ఆదేశించాలని శివసేన సుప్రీంకోర్టు తలుపు తట్టడం, దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడం తెల్సిందే. అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ చేసిన సిఫార్సును తప్పుబడుతూ తాము మరో పిటిషన్ను సిద్ధం చేశామని శివసేన లాయర్లు వెల్లడించారు. అయితే మరాఠాలో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. మొత్తం రాజకీయాలన్నీ ఇప్పుడు గవర్నర్ చుట్టూ తిరుగుతున్నాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి