బైపోల్ లో బీజేపీ హవా
కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. విపక్ష జేడీఎస్, కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో స్వల్ప ఆధిక్యం సాధించాయి. ముందుగా ఊహించినట్లుగానే బీజేపీకి అనుకూలంగా తీర్పు వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఇక శాశ్వతంగా సమసి పోయినట్లే అని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్కు ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్ను నింపేలా ఉన్నాయి. యడ్డీ సర్కార్ నిలబడాలంటే15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు విజయం సాధిస్తే చాలు.
ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలుపొందినా ఆ సంఖ్య 111కి చేరుతుంది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియూరప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగిస్తున్నాయి. కన్నడలో ఇక తమకు తిరుగులేదని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కన్నడ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఇక కాలం చెల్లినట్టే అని ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగి పోయారు.
ఇక యడియూరప్ప సర్కార్ను మరోసారి కూల్చాలని కలలుకన్న జేడీఎస్, కాంగ్రెస్లకు ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలే ఎదురయ్యేలా ఉన్నాయి. అన్ని స్థానాల్లో వేరువేరుగా పోటీకి దిగిన విపక్షాలు అధికార బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వనట్లు తెలుస్తోంది. కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే విపక్షాలు ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చేలా ఉన్నాయి.15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే ఈ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, ట్రబుల్ షూటర్ డి.కె.శివకుమార్ ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి