కన్నడ కేబినెట్ లో ఛాన్స్ ఎవ్వరికో

కన్నడ నాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ సర్కార్ తన సత్తాను చాటింది. అయితే సర్కారు ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీని సాధించి పెట్టారు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప. అయితే భారీ విజయాలను నమోదు చేసుకున్నప్పటికీ, గెలుపొందిన వారిలో ఎవరికి కేబినెట్ లో చోటు కల్పించాలో తెలియక యెడ్డీలో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉండగా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రకటించారు. ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేయగా 11 మంది విజయం సాధించారు. వారందరికీ మంత్రి పదవులు ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

వారికి కేబినెట్‌లో చోటిస్తే బీజేపీలో సీనియర్‌ నేతలు భగ్గుమనే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఓడిన ఎంటీబీ నాగరాజు, హెచ్‌.విశ్వనాథ్, టికెట్‌ దక్కని ఆర్‌.శంకర్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నా ఖాళీలు లేవు. ఉప ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారిన బెళగావి జిల్లా రాజకీయాలు ఫలితాల అనంతరం కూడా వేడిగానే ఉన్నాయి. జిల్లా నుంచి ప్రస్తుతం లక్ష్మణ సవది మంత్రివర్గంలో ఉన్నారు. అయితే మరో ముగ్గురు రమేశ్‌ జార్కిహోళి, శ్రీమంతపాటిల్, మహేశ్‌ కుమటళ్లి ప్రస్తుతం గెలిచారు. ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే గనుక జిల్లా నుంచి నలుగురు కేబినెట్‌లో ఉంటారు. ఇక ఉత్తర కన్నడ జిల్లా నుంచి హెబ్బార్‌కు, చిక్కబళ్లాపుర నుంచి కె.సుధాకర్‌కు మంత్రి పదవి దక్కాల్సి ఉంది.

మంత్రివర్గంలో బెర్తు ఆశించిన ఎస్‌టీ సోమశేఖర్, కె.గోపాలయ్య, భైరతి బసవరాజుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని సమాచారం. కాగా బెంగళూరు పరిధిలో ప్రస్తుతం అశ్వర్థ నారాయణ  , ఆర్‌.అశోక్‌  , సురేశ్‌ కుమార్‌, సోమణ్ణ కేబినెట్‌లో కొనసాగుతున్నారు. మండ్య నుంచి కేబినెట్‌లో చేరే ఏకైక మంత్రిగా కేసీ నారాయణెగౌడ అవుతారు. అదేవిధంగా బళ్లారి జిల్లాకు కూడా ఆనందసింగ్‌ కు చోటు దక్కాల్సి ఉంది. వీరందరిని ఎలా మేనేజ్ చేస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.  

కామెంట్‌లు