ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ

ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల జేఏసీ మరోసారి వెనక్కి తగ్గింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడించారు. కార్మికులంతా విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. అలాగే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకు రావాలని కార్మికులకు సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి చెప్పారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను అడ్డు కోవద్దని యాజమాన్యాన్ని కోరారు. కార్మికులదే నైతిక విజయమని ఆయన అభివర్ణించారు. ఈ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలువలేదని వ్యాఖ్యానించారు.

అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఇక నుంచి విధులకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను రక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల రక్షణ కోసమే పోరాటం చేశామని ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించిన కార్మికులకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది పోరాటానికి నాంది మాత్రమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని, కార్మికుల అవసరాలను పరిగణ లోకి తీసుకుని సమ్మె విరమించినట్టు వెల్లడించారు.

సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారానికే తప్ప, విధులను విడిచి పెట్టడానికి కాదని స్పష్టం చేశారు. సమ్మెకు ముందు ఉన్నటువంటి వాతావరణం కల్పించి ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధులు నిర్వర్తించేలా చూడాలని   కోరారు. కాగా, అక్టోబర్‌ 5వ తేదీన ప్రారంభమైన సమ్మె.. 52 రోజుల పాటు కొనసాగింది. అయితే వారం రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె చట్టబద్ధమా, వ్యతిరేకమా నిర్ణయించే అధికారం లేబర్‌ కోర్టుకు ఉందని తెలుపడంతో జేఏసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గింది. కానీ మరసటి రోజే  సమ్మె కొనసాగిస్తున్నట్టు జేఏసీ మరో ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గత నాలుగు రోజులుగా కార్మికులు విధుల్లోకి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని తిప్పి పంపిస్తున్నారు. కోడి గంటల్లో ఏం జరగబోతుందో తేలనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!