దుమ్ము రేపిన రిలయన్స్ జియో

ఇండియన్ టెలికాం సెక్టార్ లో మరోసారి రిలయన్స్ జియో సత్తా చాటింది. ఇండియన్ మార్కెట్ లో మరోసారి తనకు సాటి లేదని చాటి చెప్పింది ప్రత్యర్థి కంపెనీలకు. తాజాగా జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ రెవెన్యూ మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంది. ముఖ్యమైన మెట్రో నగరాల్లో, గ్రామీణ ప్రాంతాలలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఫలితంగా ఈ అంశంలో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని భారతి ఎయిర్‌టెల్‌ షాక్‌ ఇచ్చి టాప్‌లోకి దూసుకు వచ్చింది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఈ నివేదికను వెల్లడించింది.

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ డేటా ప్రకారం ముకేశ్‌ అంబానీ నేతృ‍త్వంలొని జియో సెప్టెంబర్ త్రైమాసికంలో బలమైన 348 బేసిస్ పాయింట్ల తో ఆర్‌ఎంఎస్‌ 35 శాతానికి చేరుకోగా, భారతి ఎయిర్‌టెల్ 32.1 శాతం ఆర్‌ఎంఎస్‌తో ఈ త్రైమాసికంలో 70 బీపీఎస్‌లు సాధించింది. అయితే మొదటి స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా సెప్టెంబరు త్రైమాసికంలో 66 బీపీఎస్‌, 27.2 శాతం క్షీణతను నమోదు చేసింది. మొత్తం 22 ప్రధాన మార్కెట్లతో 20 సర్కిల్స్‌లో మార్కెట్ వాటాను కోల్పోయింది.

తెలంగాణలో కూడా జియో హవా కొనసాగింది. ఏకంగా 37 శాతం రెవెన్యూ మార్కెట్ వాటాతో తన నాయకత్వ స్థానాన్ని జియో మరింత బలోపేతం చేసుకుంది. ఎయిర్‌టెల్ 36.5  శాతం, వొడాఫోన్ ఐడియా 20  శాతం మార్కెట్ వాటాతో సరి పెట్టుకున్నాయి. చందాదారుల సంఖ్య విషయాని కొస్తే, జూలై, సెప్టెంబర్ కాలంలో జియో 24 మిలియన్ల కస్టమర్లను చేర్చుకుంది. ఈ త్రైమాసికం ముగింపు నాటికి జియో 4జీ యూజర్ బేస్ 355.2 మిలియన్లకు చేరుకుంది. కాగా జూన్‌ క్వార్టర్‌లో జియో ఆర్‌ఎంఎస్‌ 31.7 శాతంగా ఉండగా, ఎయిర్‌టెల్‌  ఆర్‌ఎంఎస్‌ 30 శాతంగా ఉంది. 

కామెంట్‌లు